India Vs West Indies : కీలక మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. బ్యాటర్లు సత్తా చాటలేదు. బౌలర్లు చెలరేగలేదు. దీంతో చివరి టీ20లో వెస్టండీస్ సునాయాసంగా విజయం సాధించింది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ను 3-2 తేడాతో కైవసం చేసుకుంది.
ఆఖరి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. సూర్య (61, 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) చెలరేగి ఆడాడు. తిలక్ వర్మ (27) మరోసారి దూకుడుగా ఆడాడు. మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. గత మ్యాచ్ లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఓపెనర్లు యశస్వి జైశ్వాల్ (5), శుభ్ మన్ గిల్ ( 9) ఆరంభంలోనే అవుటయ్యారు. కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (14), సంజు శాంసన్ (13) విఫలమయ్యారు. దీంతో భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. విండీస్ బౌలర్లలో రోమారియో షెఫర్డ్ 4 వికెట్లు పడగొట్టాడు. అకీల్ హోసెన్ , జేసన్ హోల్డర్ రెండేసి వికెట్లు, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీశారు.
166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ రెండో ఓవర్ లో మేయర్స్ (10) వికెట్ ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పూరన్ కు ఆదిలోనే లైఫ్ లభించింది. హార్ధిక్ బౌలింగ్ లో ముఖేశ్ కుమార్ క్యాచ్ వదిలేశాడు. ఆ తర్వాత రెండు బంతులకు వరుసగా సిక్సులు కొట్టి పూరన్ టచ్ లో కి వచ్చాడు. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది.
ఓపెనర్ బ్రండన్ కింగ్ (85 నాటౌట్, 55 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సులు), పూరన్ (47, 35 బంతుల్లో ఫోర్, 4 సిక్సులు ) రెండో వికెట్ కు 107 పరుగులు జోడించి విండీస్ విజయానికి బాటలు వేశారు. పూరన్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన షై హోప్ ( 22 నాటౌట్ , 13 బంతుల్లో ఫోర్, సిక్సు) విండీస్ ను విజయ తీరాలకు చేర్చాడు. మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే విండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, తిలక్ వర్మ తలో వికెట్ పడగొట్టారు. విండీస్ బౌలర్ షెఫర్డ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, సిరీస్ లో మొత్తం 176 పరుగులు చేసిన పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కాయి.