India Vs West Indies : టీమిండియా తీరు మారలేదు. విజయానికి చేరువలోకి వచ్చి మరోసారి పరాజయాన్ని మూటగట్టుకుంది. వెస్టిండీస్ చేతిలో వరుసగా రెండో టీ20 మ్యాచ్ లోనూ ఓడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
తిలక్ వర్మ మరోసారి ఆకట్టుకున్నాడు. మ్యాచ్ లో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడాడు. తిలక్ వర్మ (51, 41 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సు) హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఇషాన్ కిషన్ (27), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (24) పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు రాణించలేదు. శుభ్ మన్ గిల్ (7), సూర్యకుమార్ యాదవ్ (1) , సంజు శాంసన్ (7) దారుణంగా విఫలమయ్యారు. దీంతో విండీస్ ముందు ఓ మోస్తరు లక్ష్యాన్ని మాత్రమే టీమిండియా ఉంచింది. విండీస్ బౌలర్లలో అకిల్ హోసెన్ , అల్జారీ జోసెఫ్ , రోమారియో షెఫర్డ్ తలో రెండు వికెట్లు తీశారు.
153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత నికోలస్ పూరన్ దూకుడుగా ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. పూరన్ (67, 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులు) రెచ్చిపోవడంతో విండీస్ విజయం దిశగా వెళ్లింది. అయితే జట్టు స్కోర్ 126 పరుగుల వద్ద పూరన్ అవుట్ కావడంతో మ్యాచ్ టర్న్ తీసుకుంది. ఆ తర్వాత 16 ఓవర్ లో విండీస్ 3 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ భారత్ చేతిలోకి వచ్చింది.
విండీస్ విజయానికి 24 బంతుల్లో 24 పరుగులు చేయాలి. కానీ చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇక భారత్ విజయం లాంఛనమే అనిపించింది.అయితే అకిల్ హోసెన్, అల్జారీ జోసెఫ్ 9 వికెట్ కు 26 పరుగులు జోడించి భారత్ ఆశలపై నీళ్లు చల్లారు. దీంతో మరో 7 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్ల తేడాతో విండీస్ విజయం సాధించింది. భారత్ బౌలర్లలో హార్ధిక్ పాండ్యా 3 వికెట్లు, చాహల్ రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్ దీప్ సింగ్, ముఖేశ్ కుమార్ కు తలో వికెట్ తీశారు.
అద్భుతంగా ఆడి విండీస్ విజయానికి బాటలు వేసిన పూరన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 5 మ్యాచ్ ల సిరీస్ లో విండీస్ 2-0 తేడాతో ముందంజలో ఉంది. మూడో టీ20 మ్యాచ్ మంగళవారం జరగనుంది.