Rohit Sharma : హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ఓడిపోవాల్సినది కాదని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఓటమికి ఇప్పటికిప్పుడు కారణాలు చెప్పలేనని అన్నాడు. ఎక్కడ ప్రోబ్లం జరిగిందనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని అన్నాడు.
ఒకటి మాత్రం నిజం.. ఈ ఓటమికి టీమ్ అందరిదీ బాధ్యతని అన్నాడు. మొదటి ఇన్నింగ్స్ లో 436 పరుగులు చేసి, 190 పరుగుల ఆధిక్యం తెచ్చుకుని మరీ ఓటమి పాలు కావడం అర్థం కావడం లేదని అన్నాడు.ఈ సమయంలో లోయర్ ఆర్డర్ నుంచి టాప్ ఆర్డర్ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అన్నాడు.
నిజానికి సిరాజ్, బుమ్రా ఇద్దరూ ఐదో రోజుకి మ్యాచ్ ని తీసుకువెళతారని భావించానని అన్నాడు. ఆ ఒక్క ఓవర్ ఆగి ఉంటే, మరుసటిరోజు ఉదయం 20 నుంచి 30 పరుగులు చేయడం పెద్ద కష్టమైన విషయం కాదని అన్నాడు. అయితే టెయిల్ ఎండర్స్ ఆడిన విధానం, విజయం కోసం వారు పడిన తపన, కష్టం మరిచిపోలేనివని అన్నాడు.
ఓలిపోప్ అద్భుత బ్యాటింగ్ తో టీమ్ ఇండియాకు మ్యాచ్ ని దూరం చేశాడని అన్నాడు. సొంత పిచ్ మీద విదేశీ బ్యాటర్ అద్భుతంగా ఆడి సెంచరీ చేస్తే, మనం చేతులెత్తేయడం ఇబ్బందికరంగా ఉందని అన్నాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం సాధించడానికి ప్రధాన కారణం ఓలీపోప్ అని తెలిపాడు. అంతేకాదు టీమ్ ఇండియాని ఆల్ అవుట్ చేయడానికి ఫీల్డింగ్ లో సరైన ప్రణాళికలు అమలు చేసి విజయం సాధించారని తెలిపాడు.
230 పరుగుల లక్ష్యం పెద్ద కష్టమైనది కాదని భావించానని అన్నాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మేం సరిగ్గా బ్యాటింగ్ చేయలేదని తెలిపాడు. అయితే ఇంకా 4 టెస్ట్ మ్యాచ్ లు ఉన్నాయి. ఇది మొదటిది మాత్రమే. అందుకని వచ్చే మ్యాచ్ ల నుంచి జాగ్రత్తగా ఆడి లెక్క సరిచేస్తామని తెలిపాడు.