Wanindu Hasaranga : జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్ లో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ స్పిన్ మాయాజాలంతో అద్భుతం చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 7 వికెట్లు తీయడంతో జింబాబ్వే 96 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే హసరంగా 5.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి, 19 పరుగులు ఇచ్చాడు. అంతే కాదు వన్డే మ్యాచ్ లో, 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన 15వ బౌలర్ గా రికార్డులకి ఎక్కాడు.
హసరంగ కన్నా ముందు శ్రీలంకకే చెందిన చమిందావాస్ ఉన్నాడు. తను కూడా జింబాబ్వే మీద 2001లో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 8 వికెట్లు తీశాడు. తర్వాత శ్రీలంకకే చెందిన ముత్తయ్య మురళీధరన్ 2000లో భారత్ పై 7 వికెట్లు తీశాడు. కాకపోతే తను 30 పరుగులు ఇచ్చాడు. వీరి తర్వాత ఆ ఘనత సాధించిన మూడో శ్రీలంక బౌలర్ గా హసరంగ రికార్డ్ సృష్టించాడు.
జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో మొదటి వన్ డే వర్షార్పణమైంది. రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. అయితే నిర్ణయాత్మకమైన మూడో వన్డేకు కూడా వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం తగ్గిన తర్వాత అంపైర్లు మ్యాచ్ ని 27 ఓవర్లకు కుదించారు. దీంతో జింబాబ్వే టీ 20 తరహాలో దూకుడుగా ఆడి, వికెట్లు పోగొట్టుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 22.5 ఓవర్లలో 96 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత 97పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 16.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రం కోల్పోయి ఛేదించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0 తేడాతో శ్రీలంక సొంతం చేసుకుంది.
వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత ఐసీసీ ఆగ్రహానికి గురైన శ్రీలంక మళ్లీ చచ్చీచెడి అంతర్జాతీయ మ్యాచ్ లకు అనుమతి తెచ్చుకుంది. ఈ క్రమంలో జింబాబ్వేతో జరిగిన సిరీస్ తో తను మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది. గాయంతో క్రికెట్ కి దూరమైన స్పిన్నర్ హసరంగ మళ్లీ జట్టులోకి వచ్చి పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. అంతేకాదు చరిత్రలో నిలిచిపోయేలా బౌలింగ్ చేశాడు. తన కెరీర్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.