Virat Kohli : రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఎట్టికేలకు టెస్టుల్లో సెంచరీ కొట్టాడు. అహ్మదాబాద్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో కోహ్లీ శతకం బాదాడు. ఎంతో ఓపికతో బ్యాటింగ్ చేసిన విరాట్.. 241 బంతుల్లో వంద మార్కును చేరుకున్నాడు. అందులో కేవలం 6 బౌండరీలు మాత్రమే కొట్టాడంటే ఈ ఇన్నింగ్స్ ఎలా నిర్మించాడో అర్థమవుతోంది.
ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పిచ్ పెద్దగా స్పిన్నర్లకు అనుకూలించలేదు. కానీ భారత్ బ్యాటింగ్ మొదలుపెట్టిన తర్వాత క్రమంగా పిచ్ మారుతోంది. మూడోరోజు కంటే నాలుగోరోజు కొంచెం టర్న్ పెరిగింది. ఆసీస్ స్పిన్ త్రయం నాథన్ లయన్ ,టాడ్ మర్ఫీ, కునెమన్ లెన్త్ బంతులు విసురుతూ టీమిండియా బ్యాటర్లకు పరీక్ష పెట్టారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న ఎల్బీ గా అవుట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ కోహ్లీ వందశాతం కచ్చితత్వంతో షాట్లు ఆడాడు . ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా సహనంతో బ్యాటింగ్ చేశాడు. క్రికెట్ ఫ్యాన్స్ ఎన్నాళ్లగానే ఎదురుచూస్తున్న సెంచరీ కలను నెరవేర్చాడు.
టెస్టుల్లో ఇది కోహ్లీకి 28వ సెంచరీ. కోహ్లీ టెస్టుల్లో 27వ సెంచరీని (136) బంగ్లాదేశ్ పై 2019 నవంబర్ 22న చేశాడు. ఆ తర్వాత 23 టెస్టుల్లో 41 ఇన్నింగ్స్ ల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఈ 23 టెస్టుల్లో 6 అర్ధ సెంచరీలు మాత్రమే చేశాడు. 2022 జనవరి 11న కేప్ టౌన్ లో దక్షిణాఫ్రికాపై చేసిన 79 పరుగులే అత్యధిక స్కోర్. ఆ 23 టెస్టుల్లో విరాట్ నాలుగు సార్లు డకౌట్ గా వెనుదిరిగాడు. 2021 మార్చి 4న ఇంగ్లాండ్ పై అహ్మదాబాద్ టెస్టులో డకౌట్ అయిన కోహ్లీ అదే వేదికపై ఇప్పుడు సెంచరీ మార్కును చేరుకోవడం విశేషం.
దాదాపు 40 నెలల తర్వాత సుధీర్ఘ ఫార్మాట్ లో కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో కోహ్లీ మరో ఘనత సాధించాడు. తాజా సెంచరీతో కలిపి అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ శతకాల సంఖ్య 75కు చేరింది. తాజా టెస్టుతో కలిపి విరాట్ కోహ్లీ కెరీర్ ఇప్పటి వరకు 108 టెస్టులు ఆడాడు. అందులో 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలున్నాయి. 14 సార్లు డకౌట్ అయ్యాడు. టెస్టుల్లో బ్యాటింగ్ సగటు 48.85 గా ఉంది. ఇప్పటికే టెస్టుల్లో 8 వేల పరుగులు దాటిన కోహ్లీ .. ఇదే జోరు కొనసాగిస్తే మరో 15 టెస్టుల్లో 10 వేల పరుగులు చేరుకోవడం ఖాయమే.
2019 ఆగస్టు 14న వెస్టిండీస్ పై సెంచరీ తర్వాత కోహ్లీ సుదీర్ఘకాలం వన్డేల్లో సెంచరీ చేయలేదు. దాదాపు 40 నెలలపాటు 25 వన్డేల్లో సెంచరీ మార్కును చేరుకోలేదు. కానీ గతేడాది డిసెంబర్ 10న బంగ్లాదేశ్ పై సెంచరీతో మళ్లీ వన్డే ల్లో ఆ మార్కును అందుకున్నాడు. ఆ తర్వాత 4 వన్డేల్లో వ్యవధిలో 3 సెంచరీలు సాధించాడు. గతేడాది సెప్టెంబర్ 8న టీ20ల్లో కోహ్లీ తొలి శతకం సాధించాడు . ఆప్ఘనిస్థాన్ పై ఆ ఘనత సాధించాడు. అప్పటి నుంచి 6 నెలల వ్యవధిలో మూడు ఫార్మాట్లతో కలిపి రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 5 సెంచరీలు కొట్టాడు. విరాట్ ఇదే జోరును కొనసాగిస్తే 100 సెంచరీలతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమయం చేసే ఛాన్స్ ఉంటుంది.
FOR MORE UPDATES PLEASE FOLLOW :https://bigtvlive.com/sports