Virat Kohli: లాస్ట్ బాల్ సిక్స్ అయితే వచ్చే కిక్కే వేరబ్బా…అన్న రేంజ్ లో కింగ్ కొహ్లీ మ్యాచ్ ముగించిన తీరు…అద్భుతం అని చెప్పాలి. క్రికెట్ అభిమానులకు మరోక్కసారి గుర్తుండిపోయే రీతిలో సెంచరీ చేసి ఛేజింగ్ లో తనని మించినవారు లేరని నిరూపించాడు. ఈ దెబ్బతో కింగ్ కొహ్లీ ఖాతాలో అనేక రికార్డులు కూడా చేరాయి. కొన్ని బద్దలయ్యాయి. అలాంటి వాటిలో ముఖ్యమైనది… ఇంటర్నేషనల్ క్రికెట్ లో అత్యధిక పరుగులు సాధించిన వారి జాబితాలో నాలుగో స్థానానికి ఎగబాకాడు. శ్రీలంక స్టార్ ప్లేయర్ మహిళ జయవర్థనేని వెనక్కి నెట్టి పైకి వచ్చాడు.
అంతర్జాతీయ కెరీర్ లో అత్యంత వేగంగా 26 వేల పరుగులు పూర్తి చేసిన జాబితాలో కొహ్లీ…567 ఇన్నింగ్స్ లో పూర్తి చేశాడు. జయవర్థనే ఈ పరుగులు చేయడానికి 725 ఇన్నింగ్స్ తీసుకున్నాడు. అంటే 158 ఇన్నింగ్స్ ముందే మన కింగ్ దాటేశాడు. ఇంకా కొహ్లీపైన ముగ్గురు లెజెండ్స్ ఉన్నారు.
సచిన్ టెండూల్కర్ నెంబర్ వన్ గా ఉన్నాడు. మాస్టర్ 782 ఇన్నింగ్స్ లో 34,537 పరుగులు చేశాడు.
సెకండ్ ప్లేస్ లో శ్రీలంక స్కిప్పర్ కుమార సంగక్కర 666 ఇన్నింగ్స్ లో 28,106 పరుగులు చేశాడు.
థర్డ్ ప్లేస్ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్ మెన్ రికీ పాంటింగ్ 668 ఇన్నింగ్స్ లో 27,483 పరుగులు చేశాడు.
తర్వాత నాలుగో ప్లేస్ లో మన కింగ్ 567 ఇన్నింగ్స్ లో 25, 960 పరుగులు చేశాడు.
ఇది కాకుండా మరో రికార్డ్ కొహ్లీ ఖాతాలో వచ్చి చేరింది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక 50 పరుగులు, అంతకు మించి చేసిన ఆటగాళ్ల జాబితాలో జాక్వస్ కలిస్ ని దాటేశాడు. తను కెరీర్ లో 211 సార్లు 50 పరుగులు పైనే చేశాడు. కొహ్లీ నిన్నటి సెంచరీతో 212కు చేరుకున్నాడు. ఇక జాబితాలో పైన ఎప్పటిలా ఆస్థాన విధ్వాంసులు సచిన్ (264), రికీ పాంటింగ్ (217), కుమార సంగక్కర (216) ఉన్నారు.
అయితే కొహ్లీ వ్యక్తిగతంగా చూస్తే…బంగ్లాదేశ్ మ్యాచ్ లో చేసినది అతని కెరీర్ లో 48వ సెంచరీ. ఓవరాల్ గా చూస్తే 78వ సెంచరీ కావడం విశేషం.
ఈ విజయంలో ధోనీ రికార్డ్ ను కూడా కొహ్లీ బ్రేక్ చేశాడు. జట్టు విజయాలలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఆటగాళ్ల జాబితాలో కొహ్లీ ఈ ఫీట్ సాధించాడు. ఐసీసీ నిర్వహించిన టోర్నమెంటుల్లో 52 మ్యాచ్ ల్లో తన భాగస్వామ్యంతో ధోనీ ఇండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు కింగ్ కొహ్లీ 53 విజయాలతో దానిని అధిగమించాడు.