IND vs AFG 1st T20 : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ టీమ్ ఇండియాకు రెండు కళ్లు లాంటి వారు. అలాంటిది వారిద్దరి విషయంలో ఏం జరిగినా సెన్సేషన్ అవుతుంది. అందుకే వారు కూడా కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. అయితే దాదాపు 14 నెలల తర్వాత టీ 20 జట్టులోకి ఎంపికయ్యారు.ఇంతవరకు అసలు వీరు ఆడతారా? లేదా? అనే సందేహాలు తొలగాయని అనుకునేసరికి, మరో బాంబ్ పేలింది.
అదేమిటంటే విరాట్ కోహ్లీ ఆఫ్గనిస్తాన్ తో జరిగే తొలి టీ 20 లో ఆడటం లేదు. అంతా ఓకే కదా, ఇప్పుడేంటిలా? ఎందుకు ఆడటం లేదు…రకరకాల ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వినిపించాయి. ఈ నేపథ్యంలో సాక్షాత్తూ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సీన్ లోకి ఎంటర్ అయ్యాడు. తను కేవలం వ్యక్తిగత కారణాలతో తొలి టీ 20 మ్యాచ్ కి అందుబాటులో ఉండటం లేదని, రెండు, మూడు టీ 20లకు వస్తాడని తెలిపాడు.
నిజంగానే విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడా? లేక కొత్తవారి కోసం, జట్టు కూర్పుకోసం ఆగమన్నారా? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీతో అలాంటి గేమ్స్ టీమ్ మేనేజ్మెంట్ ఆడదని అంటున్నారు. తను నిజంగానే అత్యవసరమైన పనులు ఉండి ఆగిపోయి ఉండవచ్చునని అంటున్నారు.
ఇకపోతే రోహిత్ శర్మతో పాటు యశస్వి జైశ్వాల్ ఓపెనింగ్ చేస్తాడని ద్రవిడ్ తెలిపాడు. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లను క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ఎంపిక చేయలేదనే ప్రశ్నలకు బదులిచ్చాడు. అవన్నీ తప్పుడు కథనాలని పేర్కొన్నాడు.
ఇషాన్ తనకి రెస్ట్ కావాలని సౌతాఫ్రికా నుంచి వచ్చేశాడు. మళ్లీ మాకు సమాచారం ఇవ్వలేదు. అందుకే ఎంపిక చేయలేదని అన్నాడు. ఇక కొత్తవారికి అవకాశం కోసమే శ్రేయాస్ పక్కకి జరిగాడని చెప్పుకొచ్చాడు. జూన్ నెలలో జరిగే పొట్టి ప్రపంచకప్ కి సన్నాహాల్లో భాగంగానే జట్టు ఎంపిక జరిగిందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.