Virat Kohli : ఏమిటీ మధ్య తరచూ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ మ్యాచ్ లకు సెలవులు పెడుతున్నాడని నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. మొన్ననే ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మూడు టీ 20ల సిరీస్ లో కూడా తొలి టీ 20లో ఆడలేదు.ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్ తో జరిగే మొదటి రెండు టెస్టులకి దూరం కానున్నాడు.
వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టుల నుంచి సెలవు కావాలని కోహ్లీ అడగడంతో బీసీసీఐ సరేనని అంగీకరించింది. కోహ్లీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని బీసీసీఐ తెలిపింది. అయితే విరాట్ ఎందుకు సెలవు పెట్టాడనే దానిపై సరైన కారణాలు వెల్లడించలేదు.
కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లతో కోహ్లీ మాట్లాడాడు. దేశం కోసం ఆడేందుకే తొలి ప్రాధాన్యత ఇస్తానని, అది తనకెంతో గర్వకారణమని ఈ సందర్భంగా తెలిపాడు. కోహ్లీ ప్లేస్ లో మరో ఆటగాడిని టీమ్ మేనేజ్మెంట్ ఎంపిక చేయనుంది.
ఒకవైపున అన్ని ఫార్మాట్లతో కలిపి 80 సెంచరీలు చేసిన కోహ్లీ 100 సెంచరీల సచిన్ రికార్డుకు మరో 20 చేస్తే సరిపోతుంది. ఇలాంటి సమయంలో ఇండియాలో జరిగే ఐదు టెస్ట్ మ్యాచ్ ల్లో తను కొన్ని సెంచరీలు చేసి, 80 దాటిస్తాడని అంతా అనుకున్నారు. అంతలోనే ఇలా జరిగేసరికి విరాట్ అభిమానులు హతాశులయ్యారు.
ఇటీవల ఆఫ్గనిస్తాన్ తో మూడో టీ 20 జనవరి 17న జరిగింది. ఇప్పుడు జనవరి 25న తొలిటెస్ట్ మ్యాచ్ జరగనుంది. ప్రాక్టీసు కోసం చాలామంది క్రికెటర్లు, జనవరి 22న హైదరాబాద్ చేరుకున్నారు. మధ్యలో కనీసం 5 రోజులు సెలవు దొరికింది. ఇది సరిపోదా? విరాట్ కి అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
కొందరేమో అనుష్క ప్రెగ్నెన్సీతో ఉంది. అదైనా కారణమై ఉండవచ్చు, లేదంటే ఇంటి దగ్గర పెద్దమ్మాయి వామిక కేరింగ్ బాధ్యతలేమైనా చూస్తున్నాడేమోనని కొందరంటున్నారు. ఇలా నెట్టింట రకరకాలుగా స్పందిస్తున్నారు.