Virat Kohli : భారతదేశ క్రికెట్ లోనే కాదు, ప్రపంచ క్రికెట్ లో పరిచయం అక్కర్లేని పేరు విరాట్ కొహ్లీ. ఇంతింతై వటుడింతైనట్టు క్రికెట్ లో సచిన్ తర్వాత.. అంతగా ఎదిగిపోయిన కొహ్లీ ముందు 2024లో పలు రికార్డులు ఎదురుచూస్తున్నాయి. వన్డేల్లో 152 పరుగులు చేస్తే చాలు.. ఒక మైలురాయి చేరుకుంటాడు. అదే టెస్టుల్లో 210 పరుగులు చేస్తే చాలు మరో మైలురాయి చేరుకుంటాడు. టీ 20లో చూస్తే మరో 35 పరుగులు చేస్తే ఒక మైలురాయి చేరుకుంటాడు.
జనవరి 25 నుంచి జరగబోయే ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా పలు రికార్డులు కొహ్లీ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇలాంటివెన్నో విశేషాలు మీకోసం.
2023 ముందు విరాట్ కొహ్లీ ఫామ్ కోసం చాలా తంటాలు పడ్డాడు. 2022లో రెండు సెంచరీలు మాత్రమే చేసిన కొహ్లీ 2020, 2021లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అంతటి తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయాడు. అలాంటి కొహ్లీ 2023లో కరెక్టుగా వరల్డ్ కప్ సమయానికి గేర్ అప్ అయ్యాడు. 765 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతేకాదు 8 సెంచరీలు, 10 అర్థ సెంచరీలు కూడా చేశాడు.
మరి 2024లో కూడా అదే ఫామ్ కొనసాగిస్తాడా? ఏడాదికి కనీసం యావరేజ్ న 7 సెంచరీల చొప్పున చేసి, తన కెరీర్ ముగిసే మరో 3 ఏళ్లలో సచిన్ రికార్డు 100 సెంచరీల మార్క్ దాటుతాడా? అనేది వేచి చూడాలి. ప్రస్తుతం 2024 లో కొహ్లీ కోసం ఎదురుచూసే రికార్డులు ఇవే..
ఇప్పటివరకు 292 వన్డేలు ఆడిన విరాట్ 14 వేల పరుగుల మైలు రాయికి మరో 152 పరుగుల దూరంలో ఉన్నాడు. అయితే 2024లో వన్డేలకన్నా టెస్ట్ లు, టీ 20 మ్యాచ్ లే ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే జులైలో శ్రీలంకలో జరిగే పర్యటనలో మూడు వన్డేలు మాత్రమే భారత్ ఆడనుంది.
అప్పుడే కొహ్లీ 152 పరుగులు చేసి ఆ మైలురాయిని దాటాల్సి ఉంటుంది. లేకపోతే ఈ ఏడాదికి ఇక ఇంతేనని చెప్పాలి. అయితే సచిన్ 14వేలకు రావడానికి 350 మ్యాచ్ లు తీసుకున్నాడు.
టెస్ట్ మ్యాచ్ ల విషయానికి వస్తే 210 పరుగులు చేస్తే 9వేల పరుగుల క్లబ్ లో చేరతాడు. ప్రస్తుతం 112 టెస్టుల్లో 8,790 పరుగులు చేశాడు.
టీ 20 మ్యాచ్ లు ఐపీఎల్ తో కలిపి మొత్తం 374 మ్యాచ్ లు ఆడి 11,965 పరుగులు చేశాడు. మరో 35 పరుగుల దూరంలో 12వేల పరుగుల మైలు రాయిని చేరుకుంటాడు. మరి టీ 20ల్లో విరాట్ కి జాతీయ జట్టులో అవకాశం లేకపోయినా ఐపీఎల్ లో ఆడి 12వేల క్లబ్ లో చేరిపోతాడు.
ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో 544 పరుగులు చేస్తే ఆ జట్టుపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అవుతాడు. ఇంతకు ముందు సచిన్ 2535 పరుగులు చేశాడు.
మరో 21 పరుగులు చేస్తే.. ఇంగ్లాండ్ పై అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక రన్స్ చేసిన భారత ఆటగాడు అవుతాడు. అలాగే మరో 30 పరుగులు చేసేస్తే ఇదే జట్టుపై 4వేల పరుగులు చేసిన తొలి టీమ్ ఇండియా క్రికెటర్ గా రికార్డ్ సృష్టిస్తాడు.
ఈ ఏడాది చివరిలో భారత్ లో న్యూజిలాండ్ పర్యటన ఉంది. అప్పుడుగానీ ఒక సెంచరీ చేస్తే, కివీస్ పై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా నిలుస్తాడు.
రానున్న రోజుల్లో బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ మ్యాచ్ లో మరో 383 పరుగులు చేసేశాడంటే సచిన్ చేసిన 820 పరుగులను దాటేస్తాడు.అలా బంగ్లాదేశ్ పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ అవుతాడు.