Virat Kohli : ఆశ్చర్యపోతున్నారా? అవునండి.. అవును.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ కావడం వెనుక కొహ్లీ వ్యూహం ఉండటం నెట్టింట వైరల్ గా మారింది. నిజానికి రోహిత్ శర్మ కెప్టెన్ అయినా సరే, గ్రౌండ్ లో తనకి తగిన సూచనలు చేయడం, బౌలర్లకి సైగలు చేయడం, ఫీల్డింగ్ సెట్ చేయడం, ఆ ప్రకారం రోహిత్ నడుచుకోవడం అంతా కొహ్లీ పథకం ప్రకారమే జరిగింది. వికెట్ల మీద వికెట్లు పడటంతో టీమ్ ఇండియా ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
తొలిటెస్ట్ మ్యాచ్ లో ఎల్గర్ 186 పరుగులు చేశాడు. తనని అవుట్ చేయడం టీమ్ ఇండియా ఐదుగురు బౌలర్ల వల్ల కాలేదు. చివర్లో ఎప్పుడో అవుట్ అయ్యాడు. ఈసారి రెండో టెస్టులో తనపైన ఫోకస్ పెట్టారు. మహ్మద్ సిరాజ్ తొలి వికెట్ కు ఎటువంటి బాల్ వేశాడో, అవే బాల్స్ అదే పనిగా ఎల్గర్ మీద ప్రయోగించాడు. అవి పనిచేసి 2 పరుగులకే తాత్కాలిక కెప్టెన్ గా ఉన్న ఎల్గర్ అవుట్ అయ్యాడు. అంతేకాదు తను ఈ మ్యాచ్ తో రిటైర్ అవుతున్నాడు. దీంతో ఎల్గర్ చాలా నిరాశగా వెనుతిరిగాడు.
అలాగే తొలిటెస్ట్ లో ఏడో వికెట్ గా వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాటర్ మార్కో జాన్సన్ 84 పరుగులు చేశాడు. ఇప్పుడు రెండో టెస్ట్ లో నిలబడితే మళ్లీ ప్రమాదమని కోహ్లీ భావించాడు. స్లిప్లో ఫీల్డింగ్ చేస్తూ.. బంతి వేసే ముందు సిరాజ్కు సైగలతో సలహా ఇచ్చాడు.
ఇన్స్వింగర్ వేయాలని సూచించాడు. బ్యాటర్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేస్తాడు, అప్పుడు క్యాచ్ వస్తుందని సైగలతో చెప్పాడు. కోహ్లీ ఎలా చెప్పాడో.. సిరాజ్ అలాగే ఇన్ స్వింగర్ వేశాడు.. అంతా అనుకున్నట్టే జరిగింది. మార్కో జాన్సెన్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ అద్భుతంగా టర్న్ అయిన బంతి అతని బ్యాట్ ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతిలో పడింది.
ఈ బంతికి మార్కో జాన్సెన్ ఆశ్చర్యపోయాడు. నిరాశగా పెవిలియన్ చేరాడు.. సిరాజ్, కోహ్లీ ఇద్దరూ సంబరాలు చేసుకున్నారు. 16వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. అలాగే రోహిత్ శర్మకు చేసే సూచనల వీడియో కూడా వైరల్ గా మారింది.