Virat Kohli latest news(sports news headlines): విరాట్ కోహ్లి.. ఈ పేరు పరుగులకు కేరాఫ్ అడ్రస్.. బ్యాట్ పట్టి మైదానంలో దిగాడంటే అంతే… ఎదుట ఏ వ్యక్తి బౌల్ చేస్తున్నారనేది కాదు.. బాల్ బౌండరీ దాటిందా లేదా అనేదే చూస్తాడు. పరుగుల వరదతో కోట్లాది మంది అభిమానుల సంపాదించుకున్న కింగ్ కోహ్లి ఇప్పుడు తరచూ వివాదాలను కొనితెచ్చుకుంటున్నారు.
ప్రస్తుతం భారత్ క్రికెట్లో విరాట్ కోహ్లీ అంశం చర్చనీయాంశంగా మారింది. కోహ్లి తన దూకుడుతనంతో అనవసర వివాదాల్లో చిక్కుకుంటూ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నాడు. మొన్నటి వరకు గంగూలీతో.. ఇప్పుడు గంభీర్తో ఇలా వరుసగా సీనియర్లతోనే గొడవలకు దిగుతున్నాడు. తన బ్యాటింగ్ స్టయిల్తో గ్రౌండ్లో ప్రత్యర్థి జట్లపై దూకుడుగా ఉండే కోహ్లి.. ఇప్పుడు తోటి క్రీడాకారులతో దురుసుగా.. దూకుడుగా వ్యవహరిస్తున్నాడు. మొన్నటి వరకు గంగూలీ, ఇప్పుడు గంభీర్తో ఇలా వరుసగా సీనియర్లతో విరాట్ కోహ్లి గొడవలకు దిగుతున్నాడు.
విరాట్ కోహ్లి వివాదాలకు ఐపీఎల్ మ్యాచ్లే వేదికవుతున్నాయి. గతంలో ఆర్సీబీ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో తన సీనియర్ అయిన సౌరవ్ గంగూలీతో విరాట్ అమర్యాదగా ప్రవర్తించాడు. డగౌట్లో కూర్చున్న గంగూలీని కోపంగా చూస్తూ ఫీల్డింగ్కి వెళ్లడం, మ్యాచ్ ముగిసిన తర్వాత గంగూలీకి షేక్హ్యాండ్ ఇవ్వకుండా ముఖం తిప్పుకోవడం.. పాంటింగ్ బలవంతంగా ఆపినా వెళ్లిపోవడంతో కోహ్లి వ్యవహారశైలి.. సగటు క్రికెట్ అభిమనులను అసంతృప్తికి గురిచేసింది. అసలు గంగూలీపై కోహ్లీకి అంత కోపం ఎందుకో చాలా మందికి అర్థం కావడం లేదు.
అసలు భారత క్రికెట్కు దూకుడు నేర్పిన సారథి ఎవరంటే.. ఠక్కున గుర్తొచ్చే పేరు బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ. సచిన్, ద్రావిడ్ వంటి సున్నితమైన మనస్తత్వం కలిగినవారి నాయకత్వం చూసిన భారత జట్టుకు దాదా దూకుడు నేర్పాడు. అప్పట్లో క్రికెట్లో ఏకఛత్రాధిపత్యం చెలాయించిన ఆస్ట్రేలియా ఆటగాళ్లతో ఢీ అంటే ఢీ అన్నాడు. అలాంటి దాదా ముందు ఇప్పటి దూకుడుతనం కలిగిన విరాట్ కుప్పిగంతులు వేయడం ఫ్యాన్స్కు ఆశ్చర్యం కలిగించింది. ఈ వివాదం.. ఒకర్నొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకునేదాకా వెళ్లింది.
గంగూలీ తర్వాత గంభీర్తోనూ గొడవ పెట్టుకున్నాడు… కోహ్లీ. ఇటీవల లక్నో-బెంగళూరు మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో.. 18 పరుగుల తేడాతో RCB విజయం సాధించింది. అయితే ఆ మ్యాచ్ ముగిశాక స్టేడియంలోని బెంగళూరు అభిమానుల వైపు చూస్తూ… నోటికి తాళాలు వేసుకోమన్నట్లుగా గంభీర్ సైగ చేశాడు. నిన్న జరిగిన మ్యాచ్లో లక్నోపై బెంగళూరు విజయం దిశగా సాగుతుండగానే… కోహ్లి తన స్టైల్లో గంభీర్కు కౌంటర్లు ఇచ్చాడు. మ్యాచ్ ముగిశాక కోహ్లీ-గంభీర్ మధ్య పెద్ద గొడవే జరిగింది. దాంతో ఇరుజట్ల ఆటగాళ్లు సర్దిచెప్పి ఇద్దర్నీ పక్కకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న ఐపీఎల్ నిర్వాహకులు… నిబంధనల ప్రకారం ఇద్దరికీ జరిమానా విధించారు.
విరాట్ కోహ్లీ ప్రవర్తన అత్యంత చెత్తగా ఉందని ఇటీవల ఓ ప్రముఖ బాలీవుడ్ నటుడు కూడా విమర్శించారు. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు అయినప్పటికీ, అతని ప్రవర్తనతో ఆటతీరు, నైపుణ్యం, రికార్డులు మరుగున పడిపోతున్నాయని విమర్శించారు. క్రికెట్ మైదానంలో కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిగా ప్రవర్తించడం లేదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ వేదికగా స్వదేశీ ఆటగాళ్లతోనే తరచూ గొడవలకు దిగుతూ అందరి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీ… ఇప్పటికైనా తన ఆటపై దృష్టి పెట్టాలని అభిమానులు హితవు పలుకుతున్నారు.