టీమ్ ఇండియా ఇన్నింగ్స్, 32 పరుగుల తేడాతో ఓటమి పాలైన దానికి ఏడవాలో, కొహ్లీ సాధించిన రికార్డులకి నవ్వాలో తెలీడం లేదని ఒక సగటు క్రికెట్ అభిమాని వ్యాఖ్యానించాడు. టీమ్ ఇండియా గెలుపు, ఓటములతో సంబంధం లేకుండా తన ఆట తీరు తను ఆడుతూ విరాట్ కొహ్లీ ముందుకు సాగిపోతున్నాడు.
నిరంతరమైన శ్రమ, పట్టుదలలే తనీ స్థాయికి చేరడానికి కారణమయ్యాయి. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొహ్లీ ఉన్నాడనే ధైర్యం జట్టు సభ్యులతో పాటు, దేశంలోని క్రీడాభిమానులకు ఉంటుంది. ఈసారి టెస్ట్ మ్యాచ్ లో ఓటమి పాలైనా కొహ్లీ మాత్రం చరిత్ర సృష్టించాడు.
ఇంతకీ విషయం ఏమిటంటే విరాట్ కొహ్లీ తొలి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో 76 పరుగులు చేశాడు. తను 18 పరుగుల వద్ద ఉండగా అంతర్జాతీయ క్రికెట్లో ఒకే క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సార్లు 2వేల పై రన్స్ చేసిన తొలి బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు.
ఇంతవరకు విరాట్ కోహ్లీ ఏడు సార్లు ఒక క్యాలెండర్ ఇయర్ లో 2వేల ప్లస్ రన్స్ చేశాడు. శ్రీలంక బ్యాటర్ కుమార సంగక్కర 6 సార్లు చేసిన రికార్డును అధిగమించాడు. ఈ ఏడాది కోహ్లీ రెండు ఫార్మాట్లలో కలిపి 2వేలకు పైగా పరుగులు సాధించడం విశేషం. అయితే తను టీ 20 మ్యాచ్ ల్లో ఆడటం లేదు. అవి కూడా ఆడి ఉంటే, ఇదెప్పుడో దాటేసేవాడని అభిమానులు అంటున్నారు.
విరాట్ కొహ్లీ తన కెరీర్ లో ఇలా ఒకే క్యాలండర్ ఇయర్ లో 2వేలకు పైగా పరుగులు చేసిన సంవత్సరాలను చూస్తే.. 2012లో 2186 పరుగులు , 2014లో 2286, 2016లో 2595, 2017లో 2818, 2018లో 2735, 2019లో 2455, 2023లో 2058 పరుగులు ఇలా ఏడుసార్లు ఈ ఫీట్ సాధించాడు.
అలాగే టెస్ట్ల్లో సౌతాఫ్రికాపై అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్గా నిలిచాడు. కొహ్లీ ఇప్పుడు చేసిన 76 పరుగులతో కలిపి 1316 పరుగులు చేసి, రెండో స్థానానికి వచ్చాడు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్(1306) రికార్డును అధిగమించాడు.
అయితే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 25 టెస్ట్ల్లో సచిన్ 1741 రన్స్ చేశాడు. మరి అన్నీ కలిసి వస్తే భవిష్యత్తుల 431 పరుగులు చేసి, శభాష్ అనిపించుకుంటాడేమో చూడాలి.