Virat Kohli : జూన్ నుంచి ప్రారంభమయ్యే మినీ వరల్డ్ కప్ నాటికి టీ20 జట్టుని బలోపేతం చేయడంపై బీసీసీఐ దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతమైన ప్రదర్శన చేసిన జట్టునే తిరిగి, టీ 20 ప్రపంచకప్ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశం సెలక్టర్ల మదిలో ఉన్నట్టుంది.
అందుకే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను మళ్లీ టీ 20 ఫార్మాట్ లోకి తీసుకున్నారు. సౌతాఫ్రికా వెళ్లిన సెలక్షన్ కమిటీ బృందం కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో సుదీర్ఘంగా చర్చించారు. అలాగే విడివిడిగా కూడా మాట్లాడారు. ముఖ్యంగా విరాట్ తో చాలాసేపు సెలక్టర్లు గడిపినట్టు సమాచారం.
ఎందుకంటే విరాట్ ఇప్పుడు సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ ను ఎవరూ మరిచిపోలేరు. అలాగే సౌతాఫ్రికాపై టెస్ట్ మ్యాచ్ ల్లో కఠినమైన పిచ్ లపై కూడా ఎన్నో విలువైన పరుగులు సాధించాడు.
ఇవన్నీ పక్కన పెడితే టీ 20 మ్యాచ్ ల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ కోహ్లీ పేరు మీదే ఉంది. ఇంతవరకు 115 మ్యాచ్ లు ఆడి 4,008 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. తన తర్వాత రోహిత్ శర్మ 148 మ్యాచ్ లు ఆడి 3,853 పరుగులతో ఉన్నాడు.
ఇదే విషయాన్ని సెలక్టర్లు విరాట్ తో చర్చించి, టీ 20 ప్రపంచకప్ లో తనెంత విలువైన బ్యాటర్ అన్నది గుర్తు చేసి, మరింత బాధ్యతగా ఆడి, దేశానికి, క్రికెట్ కి మంచి పేరు తీసుకురావాలని పదేపదే హిత బోధ చేసినట్టు సమాచారం. రన్స్ అవసరమైనప్పుడు అందుకు తగినట్టుగా, వికెట్లు పడుతున్నప్పుడు జాగ్రత్తగా, ఎప్పటిలా తన స్టయిల్ లో ఆడి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాలని, అదే ఆగ్రిసివ్ నెస్ తో ఉండాలని సూచించినట్టు సమాచారం.
ఆ ప్రామిస్ తీసుకున్న తర్వాతే జట్టులోకి విరాట్ కోహ్లీని తీసుకున్నారని అంటున్నారు. అంటే టీ 20 వరల్డ్ కప్ బాధ్యతను కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు, విరాట్ పై కూడా బాధ్యతలు పెట్టారని చెబుతున్నారు. అందుకే సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఆ పాత్రలోకి ఎంటర్ అయిపోయాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు సలహాలు ఇచ్చాడు. ఫీల్డింగ్ మార్పులు సూచించాడు. అలాగే బౌలర్స్ కి కొన్ని సూచనలు చేసి వికెట్లు వచ్చేలా చేశాడు. అలా సిరాజ్ కి ఇచ్చిన సూచనలు ఎలా ఫలించాయో రెండోటెస్టులో అందరికీ తెలిసిందే.
ఇప్పుడదే తీరుతో రానున్న టీ 20 వరల్డ్ కప్ కి జట్టులో అందరినీ సమన్వయం చేస్తూ, యువ క్రికెటర్లకి మార్గదర్శకంగా ఉంటూ, వారి లోపాలను సరిచేస్తూ ముందుకు తీసుకువెళ్లాల్సిన గురుతర బాధ్యతను విరాట్ కోహ్లీకి అప్పగించారని చెబుతున్నారు.