Virat Kohli : వన్డేల్లో 49వ సెంచరీ చేసి, సచిన్ రికార్డ్ ని సమం చేసిన విరాట్ కోహ్లీ కొత్త కొత్త రికార్డులను బద్దలు కొడుతూ ముందుకెళ్లాడు. ఎవరికి సాధ్యం కాదని అనుకునే సచిన్ రికార్డ్ సాధించి శభాష్ అనిపించాడు.
క్రికెట్ పుట్టి ఎన్నోఏళ్లయ్యింది. అందులో వన్డే మ్యాచ్లు ప్రారంభమైన తర్వాత ఏ ఆటగాడు కూడా సచిన్ లా 49 సెంచరీలు చేయలేదు. టెస్ట్ మ్యాచ్ ల్లో చేసిన 51 సెంచరీలు కలిపి మొత్తం 100 సెంచరీలు చేసిన వీరుడిలా సచిన్ శిఖరాగ్రానికి చేరుకున్నాడు.
ఇప్పట్లో ఈ రికార్డు కొట్టేవాళ్లే లేరని అంతా అనుకున్నారు. కానీ 12 ఏళ్లు గడిచింది. భారతదేశం నుంచే ఆ రికార్డుని కొట్టే మొనగాడు ఒకడొచ్చాడు. తనే క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లీ.. అయితే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యమే. ఈ రికార్డ్ని కొహ్లీ తర్వాత కొట్టే మొనగాడెవడు? అని… అందుకే ఆ లెక్కేమిటో ఒకసారి చూద్దాం…
విరాట్ కోహ్లీ (49) తర్వాత సచిన్ (49) ఉన్నాడు. కానీ తను రిటైర్ అయిపోయాడు. మూడో స్థానంలో రోహిత్ శర్మ (31) ఉన్నాడు. ఇప్పటికే 36 ఏళ్లు వచ్చిన రోహిత్కి అంత అవకాశం లేదు. నాలుగో స్థానంలో రికీ పాంటింగ్ (30) ఆస్ట్రేలియా , సనత్ జయసూర్య (28) శ్రీలంక, హెచ్. ఆమ్లా (27) సౌత్ ఆఫ్రికా, డీవిలియర్స్ (27) సౌతాఫ్రికా, క్రిస్ గేల్ (25) వెస్టిండీస్, సంగక్కర (25) శ్రీలంక, గంగూలీ (22) ఇండియా ఉన్నారు. వీరందరూ రిటైర్ అయిపోయారు. అందుకని వీరితో భయం లేదు.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ (22), సౌతాఫ్రికా ఓపెనర్ డికాక్ (22) సెంచరీలు చేశారు. ఇద్దరూ ఆడుతున్నారు గానీ, ప్రస్తుత వరల్డ్ కప్ తర్వాత రిటైర్ అవుతారని అంటున్నారు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 19 సెంచరీలతో ఉన్నాడు. నెంబర్ వన్ బ్యాటర్గా కూడా ఉన్నాడు. అయితే 29 ఏళ్ల బాబర్ ఇంకెన్నాళ్లు క్రికెట్ ఆడతాడో తెలీదు. ఒకవేళ మరో ఐదేళ్లు ఆడినా, 31 సెంచరీలు చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.
ఇంగ్లాండ్ బ్యాటర్ 32 ఏళ్ల జో రూట్ ఇప్పటివరకు 16 సెంచరీలు చేశాడు. వీరి తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (13), స్టీవ్ స్మిత్ (12), ఫఖర్ జమాన్ (11), బెయిర్ స్టో (11), జాస్ బట్లర్ (11) ఉన్నారు.
ఈ లెక్కలన్నీ చూస్తే, మన ఇండియా నుంచే మరొకరు కనిపిస్తున్నారు. అతనే శుభ్ మన్ గిల్. ఆడిన 35 మ్యాచ్ ల్లో 6 సెంచరీలు చేశాడు. తనకింకా పదేళ్ల కెరీర్ ఉంది. ఇలాగే లాగిస్తే, ఇలాగే ఆడితే ఒక అవకాశమైతే ఉంది.