India in WTC Points Table : హైదరబాద్ లో టెస్ట్ మ్యాచ్ ఓటమితో టీమ్ ఇండియాకి పలు సవాళ్లు ఎదురయ్యాయి. వీటితో పాటు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమ్ ఇండియా ర్యాంకు రెండు నుంచి ఐదుకి పడిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. దాని తర్వాత సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఉన్నాయి. వారి తర్వాత ఐదో స్థానంలో టీమ్ ఇండియా చేరింది. ఇక 6వ స్థానంలో పాకిస్తాన్, 7వ స్థానంలో వెస్టిండీస్, 8వ స్థానంలో ఇంగ్లాండ్, 9వ స్థానంలో శ్రీలంక ఉన్నాయి.
ప్రతీ మ్యాచ్ కి ఇలా ర్యాంకులు మారిపోయి, పైకి కిందకి ఎగిరి పడటంపై నెట్టింట తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మ్యాచ్ ఆడితే పైకి వెళ్లడం, ఒకటి ఓడితే కిందకి పోవడం ఇది కరెక్ట్ కాదని అంటున్నారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పోటీలు రెండేళ్లకు ఒకసారి జరుగుతాయి. రెండేళ్లలో టెస్ట్ మ్యాచ్ లు జరిగిన దేశాలు, అవి సంపాదించిన పాయింట్ల ఆధారంగా మొదటి రెండు స్థానాల్లో నిలిచిన వాటి మధ్య పైనల్ జరుగుతుంది.
అలా 2021, 2023 లో జరిగాయి. రెండుసార్లు టీమ్ ఇండియా ఫైనల్ కి వెళ్లింది. ప్రస్తుత విజేత ఆస్ట్రేలియాగా ఉంది. మళ్లీ 2025న టెస్ట్ మ్యాచ్ ఫైనల్ జరగనుంది. అక్కడికి చేరాలంటే ఇంగ్లాండ్ తో ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో విజయం సాధించాల్సి ఉంటుంది. కానీ తొలి టెస్ట్ ఓటమితో ఐదో స్థానానికి వెళ్లిపోయింది. మరి మున్ముందు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.
2023లో జరిగిన ఫైనల్ లో 444 పరుగుల భారీ లక్ష్యంతో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. నాలుగో రోజు 3 వికెట్లకు 164 పరుగులు చేసి పటిష్టమైన స్థితిలో కనిపించింది. ఐదోరోజు చేతులెత్తేసింది. 234 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కేవలం 70 పరుగుల తేడాలో మిగిలిన వికెట్లన్నీ కోల్పోయింది. విరాట్ కొహ్లీ ఇలా అవుట్ కాగానే, అలా క్యూ కట్టేశారు. 209 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
2021లో న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్ లో టీమ్ ఇండియా మొదటి ఇన్నింగ్ లో 217 పరుగులు చేసింది, రెండో ఇన్నింగ్ లో 170కి ఆలౌట్ అయ్యింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 249 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో విజయానికి అవసరమైన 140 పరుగులను 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.