WPL : మహిళల ప్రీమియర్ లీగ్ లో తొలి రెండు మ్యాచ్ లు ఏకపక్షంగా సాగినా.. మూడో మ్యాచ్ మాత్రం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ ను యూపీ 3 వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. హర్లీన్ డియోల్ ( 32 బంతుల్లో 7 ఫోర్లతో 46 రన్స్ ), సబ్బినేని మేఘన ( 15 బంతుల్లో 5 ఫోర్లతో 24 రన్స్ ), గార్డనర్ (19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సుతో 25 రన్స్) రాణించడంతో గుజరాత్ భారీ స్కోర్ సాధించింది. యూపీ బౌలర్లలో ఎకిల్ స్టోన్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు. అంజలీ శర్వాణీ, తాహిలా మెక్ గ్రాత్ తలో వికెట్ తీశారు.
తడబడి.. నిలబడి..
లక్ష్యచేధనలో యూపీ వారియర్స్ ఆదిలోనే తడబడింది. 20 పరుగలకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే కిరణ్ నవ్ గిరె ( 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 53 రన్స్ ) హాఫ్ సెంచరీతో మెరవడంతో విజయావకాశాలను మెరుగుపర్చుకుంది. అయితే రెండు పరుగుల వ్యవధిలో 3 వికెట్లు పడటంతో మళ్లీ యూపీ కష్టాల్లో పడింది. దీంతో 88 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మరి కాసేపటికే 105 పరుగుల వద్ద ఏడో వికెట్ ను చేజార్చుకుంది. దీంతో ఇక ఈ మ్యాచ్ లో గుజరాత్ గెలుపు లాంఛనమే అన్న అంచనాలు ఏర్పడ్డాయి.
గ్రేస్ విధ్వంసం..
26 బంతుల్లో 65 పరుగులు చేయాల్సిన సమయంలో గ్రేస్ హారిస్, ఎకిల్ స్టోన్ కలిసి అద్భుతమే చేశారు. గుజరాత్ కు షాక్ ఇచ్చారు. ఎడాపెడా ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. దీంతో చివరి 4 ఓవర్లలో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. చివరి ఓవర్ లో విజయానికి 19 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఎదురైనా యూపీ మరో బంతి మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.
యూపీ బ్యాటర్ గ్రేస్ హారిస్ కేవలం 26 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సులతో 59 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలిపించింది. ఎకిల్ స్టోన్ ( 12 బంతుల్లో 22 పరుగులు నాటౌట్) గ్రేస్ కు చక్కటి సహకారం అందించింది. కిమ్ గార్త్ 5 వికెట్లు పడగొట్టినా జట్టును గెలిపించలేకపోయింది. బ్యాట్ తో పెను విధ్వంసం సృష్టించిన గ్రేస్ హారిస్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. గుజరాత్ తొలి మ్యాచ్ లో ముంబై చేతిలో ఓడింది.