Angelo Mathews : బంగ్లాదేశ్-శ్రీలంక జట్ల మధ్య టైమ్డ్ అవుట్ వివాదం ముదిరి పాకాన పడుతోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్, శ్రీలంక ఆటగాడు మాథ్యూస్ ఇద్దరూ కరచాలనం కూడా చేసుకోలేదు. దీంతో ఈ అంశం రచ్చరచ్చ అయిపోయింది. అంతేకాదు ఈ విషయంపై శ్రీలంక ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నేనేమీ తప్పు చేయలేదని చెప్పాడు. బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఇలాగే క్రికెట్ ఆడాలని అనుకుంటే, ఆ స్థాయికి దిగజారిపోండి, అంతేగానీ ఇలా ప్రవర్తించడం మాత్రం చాలా తప్పు. నేనెంత సమయంలో రెడీ అయ్యానో నా దగ్గర ఆధారాలున్నాయి. అందుకు తగిన వీడియోలున్నాయి. అప్పటికింకా నాకు ఐదు సెకన్ల సమయం మిగిలి ఉందని అన్నాడు. మరి అవేవీ చూడకుండా అంపైర్లు ఎందుకంత అత్యుత్సాహం చూపించారో నాకైతే అర్థం కావడం లేదని వారికి చురకలు అంటించాడు.
నేను జరిగినదంతా ఎంతో వినయంగా, ఓపికగా, బాధ్యతగా అంపైర్లకు వివరించాను. మరి వారి కామన్ సెన్స్ ఏమైందో తెలీదు. టైమ్డ్ అవుట్ కి అంత ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్క మాట బంగ్లాదేశ్ కెప్టెన్ కి చెప్పి ఉంటే సరిపోయేదని అన్నాడు. వెళ్లి వాళ్లని అడిగితే. ఆ బంగ్లా జట్టు నుంచి చాలా అవమానకర రీతిలో ప్రతిస్పందన వచ్చింది. అది నాకు చాలా బాధ వేసిందని అన్నాడు.
ఇన్నేళ్ల నా క్రికెట్ జీవితంలో ఆనందమయ క్షణాలు, ఉద్విగ్నభరితమైన క్షణాలు, మెగా టోర్నీల్లో విఫలమైన నాడు బాధపడిన క్షణాలే తప్ప. ఏనాడు ఇలాంటి అవమానకర క్షణాలని ఎదుర్కోలేదని అన్నాడు.ఇక్కడ నేను మన్కడింగ్, ఫీల్డర్ ని అడ్డుకోవడం లాంటి వాటి గురించి మాట్లాడటం లేదు. టైమ్డ్ అవుట్ విషయంలో ఇలా జరిగి ఉండాల్సింది కాదని అన్నాడు.
ఈ విషయంలో షకీబ్ ఇంకా ప్రతిస్పందించ లేదు. తనెందుకిలా చేయాల్సి వచ్చిందో వివరిస్తే బాగుండేదని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. లేదంటే ఈ వేడిలో ఏమైనా మాట్లాడితే మరింత మండిపోతుందని ఆగాడో తెలీదు. ఇది ఒక్క షకీబ్ కే కాదు, బంగ్లాదేశ్ జట్టుకే అవమానకరంగా మారిందని కూడా అంటున్నారు. బహుశా బోర్డు కూడా షకీబ్ ని వివరణ అడగవచ్చునని కూడా అంటున్నారు.