World Cup 2023 : వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ ల కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో 50 రోజుల్లో ఈ మెగా టోర్ని ప్రారంభం కానుంది. ప్రపంచ్ కప్ భారత్ వేదికగా జరగబోతుంది. దీంతో ఈ టోర్నిపై మరింత ఆసక్తి పెరిగింది. క్రికెట్ అభిమానులు ప్రత్యక్షంగా మ్యాచ్ ను చూసేందుకు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. వారికి ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వన్డే ప్రపంచ కప్ టికెట్ల నమోదు ప్రక్రియను ప్రారంభించింది.
ఆగస్టు 25న టికెట్ల అమ్మకాలు మొదలవుతాయి. టికెట్ల కోసం ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మంగళవారమే ఈ రిజిస్ట్రేషన్ లింక్ ను ఐసీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. టిక్కెట్ బుకింగ్ కోసం https:///www.cricketworldcup.com/rgister లింక్ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఆగస్టు 25న భారత్ మినహా ఇతర జట్ల వార్మప్, ప్రపంచ కప్ టోర్నీ మ్యాచ్లకు టికెట్ల అమ్మకాలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత టీమ్ఇండియా మ్యాచ్ల టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు.
గోహతి, తిరువనంతపురంలో భారత్ ఆడే మ్యాచ్ టిక్కెట్ల విక్రయాలు ఆగస్టు 30న ప్రారంభమవుతాయి. చెన్నై, ఢిల్లీ, పూణెలో టీమిండియా ఆడే మ్యాచ్ ల టిక్కెట్స్ ఆగస్టు 31 నుంచి అమ్ముతారు. ధర్మశాల, లక్నో, ముంబైలో ఇండియా ఆడే మ్యాచ్ ల టిక్కెట్స్
సెప్టెంబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తాయి. బెంగళూరు, కోల్కతా లో జరిగే టీమిండియా మ్యాచ్ ల టిక్కెట్స్ ను సెప్టెంబర్ 2న విక్రయిస్తారు. అహ్మదాబాద్ మ్యాచ్ టిక్కెట్లు సెప్టెంబర్ 3 నుంచి అందుబాటులో ఉంటాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ ల టికెట్లు సెప్టెంబర్ 15న అమ్ముతారు.
అహ్మదాబాద్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య అక్టోబర్ 5న తొలి మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 19న ఫైనల్ నిర్వహిస్తారు. ఈ మెగా టోర్నీలో 45 లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. సెమీస్,ఫైనల్ తో కలిసి మొత్తం 48 మ్యాచ్లు నిర్వహిస్తారు. ఈసారి ప్రపంచ కప్ లో 10 జట్లు పోటీ పడుతున్నాయి. లీగ్ దశలో ప్రతి జట్టు మిగతా తొమ్మిది జట్లలో ఒక్కో మ్యాచ్లో తలపడుతుంది. లీగ్ దశలో టాప్-4లో ఉన్న జట్లు సెమీస్కు వెళతాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లో జరుగుతుంది.