Prithvi Shaw News(Latest sports news today): సెలబ్రిటీల స్థాయిలో ఉన్నవారిపై ఆరోపణలు వస్తే.. చాలామంది అది నిజమా కాదా అని నిర్ధారణ చేసుకోకముందే వాటిని వ్యాప్తి చేయడం మొదలుపెడతారు. దాని వల్ల ఎంతోమంది సెలబ్రిటీల జీవితాలు సమస్యల్లో పడతాయి. అలాగే యంగ్ క్రికెటర్ పృథ్వి షాకు కూడా అలాంటి పరిస్థితే ఎదురయ్యింది. తనపై ఒక నటి ఆరోపణలు చేయగానే.. తన తప్పు ఉందా లేదా అని తెలుసుకోకుండా విమర్శలు చేశారు. తాజాగా ఆ కేసు గురించి ముంబాయ్ పోలీసులు చెప్పిన విషయాలు చాలామందికి క్లారిటీ ఇచ్చాయి.
టీమిండియా యంగ్ క్రికెటర్ పృథ్వి షాపై సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సప్న గిల్ పలు ఆరోపణలు చేసింది. ఫిబ్రవరీలో పృథ్వి తన ఫ్రెండ్ షోబిత్తో కలిసి ముంబాయిలోని అంధేరీలో ఒక పబ్కు వెళ్లాడు. అక్కడ సప్న తనను సెల్ఫీ ఇవ్వమని అడిగింది. దానికి పృథ్వి ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం గురించి పోలీసులకు తెలిసి వారు అక్కడికి చేరుకున్నారు. సప్నాను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ తర్వాత కొన్నిరోజులకే సప్న జైలు నుండి విడుదలయ్యే పృథ్వి షా స్నేహితుడితో కలిసి తనను వేధించారంటూ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలనుకుంది సప్నా.
సప్నా చేసిన ఆరోపణలు పోలీసులు నమ్మలేదు. అందుకే పృథ్విపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. దీంతో తను మెజిస్ట్రేట్ దగ్గరకు వెళ్లింది. పృథ్వి తనను వేధిస్తున్నాడని కేసు పెట్టమని కోరింది. దీంతో మెజిస్ట్రేట్ అసలు విషయం ఏంటో తెలుసుకోమని ముంబాయి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు పబ్ సీసీటీవీ ఫోటేజ్ను రివ్యూ చేశారు. ఇందులో సప్నాదే తప్పు ఉన్నట్టు తేలిందని, పృథ్వి తనను వేధించినట్టుగా ఎక్కడా కనిపించలేదని, పృథ్విపై సప్నా చేసిన ఆరోపణలు అన్నీ తప్పు అని నిర్ధారించి ఆధారాలను మెజిస్ట్రేట్ ముందు పెట్టారు.
పోలీసులు గమనించిన సీసీటీవీ ఫోటేజ్లో పృథ్వి తన ఫ్రెండ్స్తో ఉండడాన్ని గమనించారు. ఆ తర్వాత సప్నా, తన స్నేహితులు కలిసి అనుమతి లేకుండా పృథ్విని ఫోన్లో రికార్డ్ చేయబోయారు. దీనికి తను ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతే కాకుండా సప్నా ఆగ్రహంలో వెళ్లి పృథ్వి కారు అద్దాలను పగలగొట్టడం కూడా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. పోలీసులు రావడం చూసిన తర్వాత తనది తప్పు లేనట్టుగా ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఈ సీసీటీవీ ఫోటేజ్లు అన్ని పరిశీలించిన తర్వాత తీర్పు అందిస్తామని మెజిస్ట్రేట్ కోర్టు తెలిపింది.