India Vs westindies : ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత భారత్ మరో టెస్టు సిరీస్ కు సిద్ధమైంది. కరీబియన్ గడ్డపై రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. డొమినికా వేదికగా బుధవారం తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. 2023-25 డబ్ల్యూటీసీ రౌండప్ లో భారత్ కు ఇదే తొలి సిరీస్. దీంతో సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలన్న సంకల్పంతో రోహిత్ సేన ఉంది.
భారత్ ఈ సిరీస్ ను సునాయాసంగా సొంతం చేసుకుంటుందనే అంచనాలున్నాయి. వెస్టిండీస్ జట్టులో టెస్టు అనుభవం ఆటగాళ్లు తక్కువ మంది ఉన్నారు. దీంతో టీమిండియానే ఫేవరెట్గా ఉంది. ఈ సిరీస్ లో రోహిత్ సేన కుర్రాళ్లకు అవకాశం ఇవ్వబోతోంది. యువ ఆటగాళ్లు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఐపీఎల్లో సత్తాచాటి టీమిండియా టెస్టు జట్టులో చోటు దక్కించుకున్న యశస్వి జైస్వాల్ టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. అతను ఓపెనర్గా బరిలోకి దిగుతాడని ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. శుభ్మన్ గిల్ మూడోస్థానంలో ఆ తర్వాత కోహ్లీ, రహానే బ్యాటింగ్ కు వస్తారు. కీపర్ గా ఇషాన్ కిషన్ కు చోటు దక్కే అవకాశంది. కేఎస్ భరత్ ను పక్కన పెడతారని తెలుస్తోంది.
ఈ మ్యాచ్లో భారత ఇద్దరు స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది. ఆ బాధ్యత అశ్విన్, జడేజాకు అప్పగిస్తారు. పేసర్లగా మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ కు అవకాశం దక్కుతుంది. మూడో పేసర్గా జైదేవ్ ఉనద్కత్, నవ్దీప్ సైని, ముకేష్ కుమార్లో ఒక్కరే అవకాశం ఉంటుంది.
మరోవైపు వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో వెస్టిండీస్ జట్టు దారుణంగా ఓడింది. దీంతో తొలిసారి వన్డే ప్రపంచ కప్ కు అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు టెస్టులో ఎలా రాణిస్తుందనేది ప్రశార్థకంగా మారింది. బ్యాటింగ్లో కెప్టెన్ బ్రాత్వైట్, త్యాగ్నారాయణ్ చందర్పాల్, బ్లాక్వుడ్ కీలకం ఆటగాళ్లు.పేస్ బౌలింగ్లో మాత్రం ఆ జట్టు కాస్త బలంగానే ఉంది. కీమర్ రోచ్, గాబ్రియల్, అల్జారి జోసెఫ్, జేసన్ హోల్డర్ భారత బ్యాటర్లకు సవాల్ విసరనున్నారు. భారీకాయుడు రఖీమ్ కార్న్వాల్ విండీస్ జట్టులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు.
రోసౌలోని విండ్సర్ పార్క్ స్టేడియంలోని పిచ్ ఆరంభంలో పేసర్లకు అనుకూలిస్తుంది. చివరి రెండు రోజుల్లో స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ మైదానంలో చివరగా 2017 మేలో టెస్టు మ్యాచ్ జరిగింది. 2011లో ఇక్కడ ఆడిన టెస్టును భారత్ డ్రా చేసుకుంది. ఇప్పటివరకు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 98 టెస్టులు జరిగాయి. ఇందులో టీమిండియా 22 మ్యాచ్ ల్లో గెలిచింది. విండీస్ 30 టెస్టుల్లో విజయం సాధించింది. 46 మ్యాచ్లు డ్రా అయ్యాయి. వెస్టిండీస్లో 2019లో ఆడిన 2టెస్టుల సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది.
భారత్ జట్టు అంచనా : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, విరాట్
కోహ్లి, రహానె, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్/ఉనద్కత్
వెస్టిండీస్ : బ్రాత్వైట్ (కెప్టెన్), త్యాగ్నారాయణ్ చందర్పాల్, బ్లాక్వుడ్, అథనేజ్, రీఫర్, రఖీమ్ కార్న్వాల్, జోష్వా ద సిల్వా, హోల్డర్, అల్జారి జోసెఫ్, కీమర్ రోచ్, షనోన్ గాబ్రియల్