Test Match : బంగ్లాదేశ్ లో జరుగుతున్న తొలి టెస్టుపై భారత్ పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 404 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓవర్ నైట్ స్కోర్ 278 /6 తో రెండోరోజు ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ ఆదిలోనే శ్రేయస్ అయ్యర్ వికెట్ కోల్పోయింది. అయ్యర్ 86 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత అశ్విన్ , కులదీప్ యాదవ్ అద్భుతంగా ఆడారు. 8వ వికెట్ కు 92 పరుగులు జోడించారు. ఈ క్రమంలో అశ్విన్ (58) హాఫ్ సెంచరీ సాధించాడు. అశ్విన్ అవుట్ అయిన వెంటనే కులదీప్ ( 40) , సిరాజ్ అవుట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ 404 పరుగుల వద్ద ముగిసింది.
బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం, మెహదీ హసన్ మిరాజ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. ఎబాదత్ హోస్సెన్, ఖలీద్ అహ్మద్ కు చెరో వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ బ్యాటర్లకు భారత్ బౌలర్లు చుక్కులు చూపించారు. ఆ జట్టుకు తొలి బంతికే మహ్మద్ సిరాజ్ షాక్ ఇచ్చాడు. ఓపెనర్ నజ్ ముల్ హోస్సెన్ షాంటోను డకౌట్ చేశాడు. ఆ తర్వాత యాసిర్ అలీని ఉమేష్ యాదవ్ బౌల్డ్ చేశాడు. జకీర్ హసన్ (20), లిటన్ దాస్ (24) నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా సిరాజ్ మరోసారి చెలరేగి వారిద్దిర్నీ పెవిలియన్ కు పంపాడు. కెప్టెన్ షకీబ్ హల్ హసన్ , కీపర్ నరుల్ హసన్ ను కులదీప్ అవుట్ చేయడంతో బంగ్లాదేస్ 97 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. రెండోరోజు ఆట ముగిసేసరికి బంగ్లా 8 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది . క్రీజులో మిరాజ్, ఎబాధత్ ఉన్నారు. భారత్ బౌలర్లలో కులదీప్ కు 4 వికెట్లు, సిరాజ్ కు 3 వికెట్లు దక్కాయి. బంగ్లా ఇంకా తొలి ఇన్నింగ్స్ లో 271 పరుగులు వెనుకబడి ఉంది.