TeamIndia : ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసుకు భారత్ దూసుకెళుతోంది. తాజాగా బంగ్లా పర్యటనలో రెండు టెస్టులను గెలవడంతో పాయింట్ల పట్టికలో రెండోస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా 76.92 విజయ శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇక భారత్ 58.93 గెలుపు శాతంతో రెండోస్థానంలో కొనసాగుతోంది. సోమవారం నుంచి మెల్బోర్న్లో ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్ ఆడనున్న దక్షిణాఫ్రికా 54.55 శాతం విజయాలతో మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో శ్రీలంక, ఇంగ్లాండ్,వెస్టిండీస్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి.
తాజాగా భారత్ మిర్పూర్లో జరిగిన టెస్టులో బంగ్లాపై విజయం సాధించడంతో టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్లోకి అడుగుపెట్టేందుకు టీమిండియాకు అవకాశాలు మెరుగయ్యాయి. టెస్టు ఛాంపియన్షిప్లో దక్షిణాఫ్రికా నుంచి భారత్ బలమైన పోటీ ఎదుర్కొంటోంది.
భారత్.. ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్లో 4-0 తేడాతో విజయం సాధిస్తే 68.05 విజయ శాతం లభిస్తుంది. అప్పుడు దక్షిణాఫ్రికా మిగిలిన నాలుగు టెస్టులను గెలిచినా కూడా విజయాల శాతం 66.66 గా ఉంటుంది. అప్పుడు ఆ జట్టు ఫైనల్స్ చేరదు. ఇక భారత్ 3-0తో ఆసీస్ పై సిరీస్ను సాధిస్తే మాత్రం విజయాల శాతం 64.35 చేరుతుంది. అప్పుడు దక్షిణాఫ్రికా నాలుగు టెస్టుల్లో విజయం సాధిస్తేనే ఫైనల్స్కు అడుగుపెడుతుంది. ఇక మిగిలిన జట్లకు ఫైనల్స్కు చేరేందుకు మార్గాలు దాదాపు మూసుకుపోయాయి.