Team India : ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. అయితే ఈ గెలుపు అంత వీజీగా రాలేదు. చివరి బంతి వరకు ఇరుజట్ల మధ్య విజయం దోబూచులాడింది. చివరకు 2 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. విజయానికి చివరి 3 బంతుల్లో 5 పరుగులు చేయాల్సిన సమయంలో శ్రీలంక బ్యాటర్లు తడబడ్డారు. దీంతో భారత్ గెలిచింది. 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ఆదిలోనే తడబడింది. రెండో ఓవర్ లోనే అరంగేట్రం బౌలర్ శివం మావి ఓపెనర్ నిస్సాంకను పెవిలియన్ కు పంపాడు. కాసేటికే ధనుంజయ డిసిల్వాను అవుట్ చేసి భారత్ కు మావి బ్రేక్ తూ అందించాడు. మరోవైపు హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ విజృంభించడంతో శ్రీలంక 68 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే కెప్టెన్ శనక, హసరంగ డిసిల్వా దాటిగా ఆడుతూ జట్టు స్కోర్ ను 100 పరుగులు దాటించారు. ఆ తర్వాత హసరంగా అవుటైనా..చమిక కరుణరత్నే కెప్టెన్ తో కలిసి గట్టిపోరాటం చేశాడు. శనక అవుటైన తర్వాత కరుణరత్నే అదే దూకుడుతో ఆడి జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. చివరి రెండు బంతులకు ఇద్దరు బ్యాటర్లు రనౌట్ కావడంతో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది.
యువసత్తా
తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన శివం మావి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్ల కోటాలో 22 పరుగులే ఇచ్చి 4 వికెట్లు నేలకూల్చాడు. ఇక మరో యువ బౌలర్ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ కూడా సత్తా చాటాడు. 27 పరుగులే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్ కీలక సమయంలో 2 వికెట్లు పడగొట్టినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. కెప్టెన్ హార్థిక్ పాండ్యా వికెట్లేమి తీయకపోయినా పొదుపుగా బౌలింగ్ చేశాడు. స్పిన్నర్లు చాహల్, అక్షర్ పటేల్ కు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. వీరు పరుగులు కూడా భారీగా ఇచ్చేశారు.
తడబ్యాటు
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 162 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ ద్వారా శుభ్ మన్ గిల్ టీ20లో అరంగేట్రం చేశాడు. అయితే కేవలం 7 పరుగులే చేసి నిరాసపర్చాడు. పవర్ ప్లే ముగిసే లోపే భారత్ కీలకమైన సూర్యకుమార్ ( 7 పరుగులు ) వికెట్ ను కూడా కోల్పోయింది. ఆ తర్వాత సంజు శాంసన్ ( 5 పరుగులు) ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. ఒక దశలో భారత్ 46 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో ఓపెనర్ ఇషాన్ కిషన్ (37 పరుగులు ), కెప్టెన్ హార్థిక్ పాండ్యా ( 29 పరుగులు) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. జట్టు స్కోర్ 100 లోపే ఈ ఇద్దరు అవుట్ అయ్యారు. దీంతో భారత్ స్కోర్ 150 పరుగులు దాటడం కష్టమనిపించింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన దీపక్ హుడా ( ఒక ఫోర్, 4 సిక్సులసాయంతో 41 పరుగులు), అక్షర్ పటేల్ ( 3 ఫోర్లు, సిక్సుసాయంతో 31 పరుగులు) మెరుపులు మెరిపించడంతో భారత్.. శ్రీలంక ముందు 163 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ జంట ఆరో వికెట్ కు అజేయంగా 35 బంతుల్లో 68 పరుగులు జోడించింది. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన దీపక్ హుడాకు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో టీ20 గురువారం పుణెలో జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది.