Team India: భారత టీం ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం జింబాబ్వే పర్యటనలో ఉన్నది. తాజాగా ఈ సిరీస్లో మూడో మ్యాచ్ హరారే వేదికగా జరిగింది. తొలి మ్యాచ్ ఓడిపోయిన భారత్ రెండో మ్యాచ్ గెలిచింది. తాజాగా మూడో మ్యాచ్ కష్టపడి 23 పరుగుల ఆధిక్యంతో విజయాన్ని కైవసం చేసుకుంది. మొత్తంగా సిరీస్లో భారత్ లీడ్లో ఉన్నది.
తాజా మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 183 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందు ఉంచింది. జింబాబ్వే టీమ్ కూడా నిలకడగా రాణించింది. తొలి ఓవర్లలో ఐదు వికెట్లు చేజార్చుకున్న ఆ టీమ్ వంద పరుగులైనా సాధిస్తుందా? అనే అనుమానం ఏర్పడగా.. డియోన్ మేయర్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అజేయంగా 65 పరుగులు సాధించి టీమ్లో ఉత్సాహం పెంచాడు. ఇక మండాడే కీలక సమయంలో వచ్చి టీమ్కు దన్నుగా నిలిచాడు. మొదట్లో వెంట వెంటనే వికెట్లు సమర్పించుకున్న జింబాబ్వే ఆ తర్వాత ఆచితూచి నిలకడగా ఆడింది. ఓవర్లు కరిగిపోతున్నా కొద్దీ పరుగులు పెరగడంతో జింబాబ్వే గెలుస్తుందేమోనని అనిపించింది. కానీ, భారత బౌలర్లు వారిని కట్టడి చేయగలిగారు. లక్ష్యాన్ని 23 పరుగుల వద్దే వారిని నిలిపేశారు.
కెప్టెన్ శుభ్మన్ గిల్ టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ అదిరిపోయే ప్రారంభాన్ని అందించారు. తొలి వికెట్ పడేసరికి 67 పరుగులు జోడించారు. ఇక గిల్ కూడా 49 బంతుల్లో 66 పరుగులతో అదరగొట్టారు. రుతురాజ్ 49 పరుగులతో వెనుదిరిగి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. యశస్తి జైస్వాల్ కీలక ఇన్నింగ్ ఆడాడు. 36 పరుగులు జోడించాడు. అభిషేక్ శర్మ పది పరుగులు సాధించి పెవిలియన్ బాట పట్టాడు. చివరిలో వచ్చిన సంజూ శాంసన్ 7 బంతుల్లో 12 పరుగులు సాధించాడు. మొత్తంగా టీమిండియా 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జింబాబ్వే టీమ్ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. దీంతో మూడో మ్యాచ్ ఇండియా వశమైంది.