Team India : దక్షిణాఫ్రికాపై తొలి టెస్ట్ లో ఓటమితో టీమ్ ఇండియా స్థానం మారిపోయింది. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. అది కూడా వెళ్లడం, వెళ్లడం పాక్ ని కూడా దాటి కిందకు పడిపోయింది. పాక్ 61.11 విన్నింగ్ పర్సంటేజీతో రెండో స్థానంలో నిలిచింది. భారత్ కంటే బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్లు కూడా ముందున్నాయి.
ఒక్క టెస్ట్ మ్యాచ్ లో ఓడిపోయినంత మాత్రాన ఇంత దిగువకి పోతామా? అని అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి టెస్టులో దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ప్రస్తుతం టీమిండియా విజయాల శాతం 44.44గానే ఉంది. ఇప్పుడు నెంబర్ వన్ ర్యాంక్ కి సౌతాఫ్రికా చేరుకుంది.
డబ్ల్యూటీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రవేశపెట్టిన తర్వాత టీమ్ ఇండియా రెండు సార్లు ఫైనల్ చేరింది. ఫైనల్ ఫోబియాతో రెండుసార్లు టైటిల్ చేజార్చుకుంది. తొలి ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. ఈ ఏడాది జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి ట్రోఫీ చేజార్చుకుంది. ఫైనల్ మ్యాచ్ ఫోబియా నుంచి భారత జట్టు ఎప్పుడు బయటపడుతుందో తెలీదు.
టెస్ట్ మ్యాచ్ ర్యాంకింగుల్లో సౌతాఫ్రికా నెంబర్ వన్ స్థానంలో ఉంది. తర్వాత రెండో స్థానంలో పాకిస్తాన్ (61.11), మూడో స్థానంలో న్యూజిలాండ్ (50.00) ఉన్నాయి. నాలుగో స్థానంలో బంగ్లాదేశ్ (50.00), ఐదో స్థానంలో భారత్ (44.44), ఆరో స్థానంలో ఆస్ట్రేలియా (41.67), ఏడో స్థానంలో వెస్టిండీస్ (16.67), ఎనిమిదో స్థానంలో ఇంగ్లండ్ (15.00), తొమ్మిదో స్థానంలో శ్రీలంక (0) ఉన్నాయి.