Hardik Pandya Post : ఆటలో గాయాలవుతూ ఉంటాయి. కానీ ఇలాంటి మెగా టోర్నీలో జరగడం ఎంతో బాధాకరమని ఇండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా భావోద్వేగంతో ట్విటర్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇది నాకెంతో ఇష్టమైన జట్టు…వీరందరినీ మిస్ అవుతున్నా, ఇది నా జీవితంలో మరిచిపోలేని ఘటన అని పేర్కొన్నాడు. టోర్నీలోని మిగిలిన మ్యాచ్ లకు దూరమవుతున్నాను అన్న వాస్తవాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని తెలిపాడు.
నేను ఎక్కడున్నా నా మనసంతా ఇక్కడే ఉంటుందని అన్నాడు. అయినా, నేను ఎల్లవేళలా టోర్నమెంట్ అయ్యేవరకు జట్టుతోనే ఉంటాను. మనవాళ్లని ప్రతి బాల్ కి ప్రోత్సహిస్తుంటానని తెలిపాడు. ఇప్పుడున్న జట్టు తప్పకుండా మనందరినీ గర్వపడేలా చేస్తుందని ఆశిస్తున్నాను. అని తెలిపాడు. వన్డే వరల్డ్ కప్ లాంటి చారిత్రాత్మకమైన ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు అని చివరిగా తెలిపాడు.
ఈ వరల్డ్ కప్ లో మూడు మ్యాచ్ లు ఆడిన హార్దిక్ 5 వికెట్లు తీసుకున్నాడు.
హార్దిక్ పాండ్యా గొప్పతనం ఏమిటంటే, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్రేక్ ఇస్తుంటాడు. ఇద్దరి బ్యాట్స్ మెన్ల పార్ట్ నర్ షిప్ ప్రమాదకరంగా మారుతుందనుకున్న దశలో తను వారిని విడదీసి జట్టుకి మేలు చేస్తుంటాడు. మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్ తన ప్రత్యేకత. బ్యాటింగ్ కి వస్తే రన్ రేట్ పెంచడంలో, తన మార్క్ సిక్సర్లు, ఫోర్లు కొట్టడం, సమయానుకూలంగా ఆడటం, ఇవన్నీ తన అమ్ములపొదిలోని అస్త్రాలు.. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటా సమర్థుడిగా పాండ్యా గుర్తింపు తెచ్చుకున్నాడు.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి అతను కోలుకుంటున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కానీ, హార్దిక్ గాయం ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని తేలింది. దీంతో విశ్రాంతి అవసరమని భావించి, మిగిలిన అన్ని మ్యాచ్ లకు హార్దిక్ ని దూరం పెట్టారు.
ఈ సందర్భంగా తను పెట్టిన ట్వీట్ మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందరూ సానుభూతి సందేశాలను పంపుతున్నారు. ధైర్యంగా ఉండమని చెబుతున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
.
.