Rohit Sharma : టీమ్ ఇండియాలో అందరూ ప్రతిభావంతులైన ఆటగాళ్లే ఉన్నారని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అందుకే టీమ్ కూర్పు పెద్ద సవాల్ గా మారుతోందని తెలిపాడు. ముఖ్యంగా ప్రతీ ప్లేస్ లో ఒకరికి ఇద్దరు ఉన్నారని, వారిలో ఎవరిని సెలక్ట్ చేసుకోవాలో తెలీక తల పట్టుకుంటున్నామని అన్నాడు.
మొదటి టెస్ట్ మ్యాచ్ లో ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవాలని అనుకున్నప్పుడు మొదటి ఛాయిస్ లో రవీంద్ర జడేజా, అశ్విన్ లను ఎంపిక చేశామని అన్నాడు. తర్వాత మూడో స్పిన్నర్ గా అక్షర్ పటేల్ ని తీసుకోవాలా? లేక కులదీప్ యాదవ్ ను తీసుకోవాలా? అనేది తేల్చుకోలేక పోయామని అన్నాడు.
చివరిగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం, పోను పోను స్పిన్ కి అనుకూలంగా మారడం వల్ల, ఒకవేళ టాప్ ఆర్డర్ విఫలమైతే, ఆల్ రౌండర్ గా ఉపయోగపడతాడని అక్షర్ పటేల్ ని ఎంపిక చేశామని అన్నాడు. అయితే వీరిద్దరిలో రెండు ప్రత్యేకతలున్నాయని తెలిపాడు.
కులదీప్ యాదవ్ కి పిచ్ తో సంబంధం లేదు. అది బౌలింగ్ కి స్పందించకపోయినా వికెట్లు తీయగలడు. అదీ తన బలమని తెలిపాడు. ఇక బౌలింగ్ కి అనుకూలిస్తే విజృంభిస్తాడని తెలిపాడు. ఈ నేపథ్యంలో తనకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాం.
కాకపోతే అప్పటికే స్పెషలిస్ట్ బౌలర్ గా అశ్విన్ ఉన్నాడు. అందువల్ల లోయర్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉండాలని చెప్పి బ్యాటింగ్ చేయగల అక్షర్ ను ఫైనల్ జట్టులోకి తీసుకున్నామని రోహిత్ శర్మ అన్నాడు. ఇప్పుడు మొదటి టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజు యశస్వి జైశ్వాల్ బజ్ బాల్ తరహాలో ఇరగదీసి ఆడాడు. అందువల్ల రాబోవు మ్యాచ్ లకు ఢోకా లేనట్టే అంటున్నారు. ఓపెనర్ గా మరొకరు వచ్చే ప్రసక్తే లేదు.
ఇక మిగిలింది శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. వీరిద్దరిలో ఎవరు ఈ రెండు టెస్టుల్లో బాగా ఆడతారనే అంశంపై, రాబోవు మూడు టెస్టు మ్యాచ్ ల భవితవ్యం ఆధారపడి ఉంది. ఎందుకంటే కొహ్లీ వస్తాడు కాబట్టి, వీరిద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు. అంతేకాదు మరోవైపు నుంచి రింకూ సింగ్ ని రెడీ చేస్తున్నారు. మరి తనని తీసుకొచ్చి ఎవరి నెత్తిమీద కుంపటి పెడతారో తెలీదని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి.