2024 జూన్ లో ప్రారంభమయ్యే టీ 20 వరల్డ్ కప్ ని… ఏ జట్టు గెలుస్తుందో అప్పుడే సీనియర్ క్రికెటర్లు జోస్యాలు చెప్పేస్తున్నారు. తమకి ఉన్న అపారమైన నాలెడ్జ్ తో అంచనాలు కడుతున్నారు.
ఎప్పుడు వివాదాలతో సహవాసం చేసే గౌతం గంభీర్, ఎప్పుడూ మౌనంగా ఉండే యువరాజ్ సింగ్ ఇద్దరూ ఏం చెప్పారో నెట్టింట సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
టీమ్ ఇండియాతో జరిగిన టీ 20 సిరీస్ ని 1-1తో సమం చేసిన సౌతాఫ్రికా విజేతగా నిలుస్తుందని మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ చెబుతున్నాడు. మరి సౌతాఫ్రికాపై గెలిచిన టీమ్ ఇండియాపై యువరాజ్ ఎందుకు శీతకన్ను వేశాడో అర్థం కావడం లేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. తను ఏమంటాడంటే ప్రస్తుతం సౌతాఫ్రికా అద్భుతంగా ఆడుతోందని కితాబిచ్చాడు. మంచి టీ 20 ప్లేయర్లు జట్టులో ఉన్నారని అన్నాడు. అందుకే ఆ జట్టుకే కప్ కొట్టే అర్హత ఉందని తేల్చి చెప్పాడు.
ఇక భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం ఒక జట్టు కాకుండా మూడు పేర్లు చెప్పాడు. అందులో టీమ్ ఇండియా లేకపోవడం విశేషం. అయితే సీనియర్లు ఎవరికి కూడా టీమిండియా కప్ సాధిస్తుందనే నమ్మకం లేకపోవడం ఆందోళన కలిగించే అంశమేనని మరికొందరు వ్యాక్యానిస్తున్నారు.
మరి గౌతమ్ గంభీర్ ఏమంటాడంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అఫ్గానిస్థాన్ జట్లు ఈ టోర్నీలో సత్తా చాటుతాయని అభిప్రాయపడ్డాడు. వన్డే వరల్డ్ కప్ 2023లో చచ్చీ చెడి ఆడి, ఏడో స్థానంతో సరిపెట్టుకున్న ఇంగ్లండ్ మీద గంభీర్ ఎందుకు మనసు పారేసుకున్నాడో అర్థం కావడం లేదని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి.
తనెప్పుడు ఫస్ట్రేషన్ తో ఉంటాడు, నిప్పుల కుంపటి మీదే ఉంటాడు కాబట్టి, ఎక్కువగా అతనితో విభేదించడం సరికాదని మరొకరు కామెంట్ చేశారు. లేకపోతే ఇప్పుడు మనల్ని ఏసుకుంటాడు. మనకెందుకొచ్చిన గొడవని ఒకరన్నారు. మరొకరేమో తనకి రోజూ మసాలా కావాలని వ్యాక్యానించారు.
టీ20 ప్రపంచకప్ 2024కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ టోర్నీలో విజేతగా నిలవాలంటే టీమిండియా తీవ్రంగా శ్రమించాలని గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్ ఇద్దరూ అభిప్రాయపడ్డారు. గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ టైటిల్ను కూడా గెలవలేదని, వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు టీ 20 మ్యాచ్ లకు కెప్టెన్ ఎవరో కూడా బీసీసీఐ చెప్పలేకపోతోందని అంటున్నారు.
హార్దిక్ పాండ్యా మీద బీసీసీఐ గంపెడాశలు పెట్టుకుంటే, తనెళ్లి మంచమ్మీద పడ్డాడు. ఇదే కోవలోకి సూర్యకుమార్ యాదవ్ కూడా చేరాడు. ఇప్పుడు మళ్లీ నువ్వే దిక్కని రోహిత్ శర్మ వైపు చూస్తున్నారు. తనేమో టెస్ట్ మ్యాచ్ ని కూడా టీ 20 తరహాలోనే ఆడి వికెట్ పారేసుకుంటున్నాడు.
తన ఆటిట్యూడ్ మారనంత కాలం టెస్ట్ మ్యాచ్ ల్లో రోహిత్ శర్మ కుదురుకోలేడని గవాస్కర్ లాంటి సీనియర్లు కామెంట్ చేస్తున్నారు. తన సహజత్వానికి భిన్నంగా ఆడాలని పదేపదే సీనియర్లు చెప్పినా సరే, రోహిత్ శర్మ ఆడటం లేదని అంటున్నారు. మరెవరు చెబితే రోహిత్ వింటాడని కూడా ఆలోచిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో టీ 20 ప్రపంచకప్ కి మరి రోహిత్ కి కెప్టెన్సీ అప్పగిస్తారా? లేదా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. లేదంటే బీసీసీఐ, ముంబయి జట్లు కలిసి ఊకుమ్మడిగా రోహిత్ శర్మ కెప్టెన్సీకి మంగళం పాడేశాయా? అని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.