T20:న్యూజిలాండ్తో జరిగిన మూడు టీ-20ల సిరీస్ను… టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. అయితే… కప్ అందుకున్నాక కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన పని… ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల మధ్య పెద్ద చర్చకే దారి తీసింది. ఇంతకీ పాండ్యా ఏం చేశాడంటే… కప్ అందుకున్నాక దాన్ని నేరుగా తీసుకెళ్లి… పృథ్వీ షా చేతిలో పెట్టాడు. దాంతో పైకి నవ్వుతూ కనిపించిన పృథ్వీ, పాండ్యా తన చేతుల్లో కప్ ఎందుకు పెట్టాడో అర్థం కాక ఆశ్చర్యకర భావనలో ఉండిపోయాడు.
ఈ సీన్ను చూసిన అభిమానులు… సోషల్ మీడియాలో పాండ్యా, పృథ్వీలపై తెగ కామెంట్స్ చేస్తున్నారు. సిరీస్లో పృథ్వీ షాకు తీవ్ర అన్యాయం జరిగిందని, వరుసగా విఫలమవుతున్న ఇషాన్ కిషన్ను మూడు మ్యాచ్ల్లోనూ ఆడించి… పృథ్వీకి కనీసం ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదని అభిమానులు కామెంట్ చేశారు. రంజీల్లో అద్భుతంగా ఆడి జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా… అతణ్ని దిష్టిబొమ్మలా బెంచ్కే పరిమితం చేశారని మండిపడ్డారు. కనీసం మూడో టీ-20లో అయినా పృథ్వీని ఆడిస్తారనుకుంటే ఆడించలేదంటూ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు. పాండ్యా ఆలోచన ఏంటో అర్థం కావడం లేదని.. టాలెంట్ ఉన్న పృథ్వీషాను తొక్కేస్తున్నారని అభిమానులు మండిపడ్డారు. ఫామ్లో లేకపోయినా ఇషాన్ కిషన్ను ఆడించారని… ఒక్క ఛాన్స్ ఇస్తే కదా పృథ్వీ సత్తా ఏంటో తెలిసేదని వ్యాఖ్యానించారు. మరికొందరైతే… చెత్త రాజకీయాల వల్ల ఎంతో మంది క్రికెటర్లు మరుగున పడిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పృథ్వీని ఆడించనందుకు సోషల్ మీడియా హోరెత్తిపోతోందని పాండ్యాకు తెలిసిందో ఏమో గానీ… మ్యాచ్ గెలిచి కప్ అందుకున్నాక… పాండ్యా నేరుగా పృథ్వీ షా దగ్గరికి వెళ్లి… ట్రోఫీని అతని చేతిలో పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పాండ్యా తీరును కొందరు మెచ్చుకుంటే… మరికొందరు మాత్రం తప్పుబట్టారు. పృథ్వీ షాను ఒక్క మ్యాచ్ కూడా ఆడించలేదన్న విమర్శలు రావొద్దన్న భయంతోనే పాండ్యా ఈ పని చేసి ఉంటాడని వ్యాఖ్యానిస్తున్నారు. పాండ్యా తెలివికి జోహార్లు అని, చివరికి పృథ్వీ షాను ఇలా కూల్ చేశారా? అని అభిమానులు విపరీతంగా కామెంట్స్, ట్రోల్ చేశారు.