Surya Kumar Yadav : తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ 20 సిరీస్ ని 4-1తో గెలిచి, అక్కడ సౌతాఫ్రికాలో టీ 20 సిరీస్ సమం చేసి భావి టీమ్ ఇండియా కెప్టెన్ గా కితాబు అందుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ ఉన్నట్టుండి హాట్ టాపిక్ అయ్యాడు. అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో తను పెట్టిన హార్ట్ బ్రేక్ ఎమోజీ నెట్టింట వైరల్ గా మారింది. ఎందుకిలా పెట్టాడని సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది.
ముంబై ఇండియన్స్ జట్టులో సూర్య కూడా ఒక స్టార్ ప్లేయర్ గా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట సూర్య ముంబై ఇండియన్స్ తరఫున ఆడేవాడు. తర్వాత 2014లో కోల్ కతా నైట్ రైడర్స్ కి మారాడు. మళ్లీ 2018లో వేలంలో ముంబై ఇండియన్స్ సూర్యాని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి రోహిత్ శర్మ నాయకత్వంలోనే నడుస్తున్నాడు. తన మార్గదర్శకత్వంలో ముందుకెళుతున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే రోహిత్ శర్మ గురువనే అంటాడు. ఇక్కడ ఆట తీరు చూసే, జాతీయ జట్టులోకి ఎంపికయ్యాడు. అక్కడ తన స్థానాన్ని అతి తక్కువ కాలంలో సుస్థిరం చేసుకున్నాడు. కెప్టెన్ వరకు ఎదిగాడు.
ఎందుకంటే రోహిత్ కూడా ఎటాకింగ్ ప్లే ఆడతాడు. సూర్యాది కూడా అదే. అందుకే తనకి టెక్నిక్స్ అన్నీ నేర్పించి తీర్చిదిద్దాడని చెబుతుంటారు. అందువల్ల గురువుగారిని తప్పించడం వల్ల బాధపడుతూ ఆ ఎమోజీ పెట్టి ఉంటాడని అంతా అనుకుంటున్నారు. అయితే దానికింద ఎటువంటి కామెంట్స్ పెట్టలేదు. దాంతో ఎవరికీ అర్థం కావడం లేదు. రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం వల్ల ఇలా స్పందించాడా?
లేక హార్దిక్ పాండ్యాను అంగీకరించడం లేదా?
లేక తననే కెప్టెన్ గా చేస్తారని ముచ్చట పడ్డాడా?
లేక ఏమైనా లవ్ ఫెయిల్యూర్ అయి అలా పెట్టాడా?
సిరీస్ సమం చేశాడు కదా…ఇంకేటి సూర్యా బాధ? అని ఒకరు… చివరికి ఏమీ అర్థం కాక ఒకతను…
దానర్థమేంటి భయ్యా! అని జుత్తు పీక్కుంటున్న ఫొటో పెట్టారు..
ఇక ముంబై జట్టుకి మూడింది అంటూ కొందరు శాపనార్థాలు పెడుతున్నారు.
మొత్తానికి సూర్యకుమార్ యాదవ్ నెట్టింట మంచి పజిల్ పెట్టాడని చాలామంది అంటున్నారు. దీనిని మరి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని కొందరు కామెంట్ చేస్తున్నారు. మొన్ననే జస్ప్రిత్ బూమ్రా కూడా కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటమే మంచిదని రాస్తే, దానికి జట్టు యాజమాన్యం అదే కరెక్టు అంటూ సమాధానం చెప్పింది. మరిప్పుడు సూర్యాకి ఏం చెబుతుందని కొందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.