T20:ఆహా.. ఏమి బ్యాటింగ్.. ఏమి విధ్యంసం.. శ్రీలంకతో జరిగిన మూడో టీ-20లో సూర్యకుమార్ యాదవ్ ఆట చూసిన తర్వాత… ఇలా అనుకోని భారత క్రికెట్ అభిమానులు ఉండరేమో. ఈ మధ్య కాలంలో ఇంత బీభత్సమైన బ్యాటింగ్ చూడలేదబ్బా! అని అంతా ఫీలయ్యేలా… సూర్య దంచికొట్టాడు. ఫాస్ట్ బౌలరా? స్పిన్నరా? అన్న తేడా లేదు… బంతి ఎక్కడ పడిందీ అన్నదీ చూడలేదు… శ్రీలంక బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు… సూర్య.
ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్య… అభిమానులను సంబరాల్లో ముంచాడు. ఆటను, మైదానాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుని మరీ సూర్య ఆడుతుంటే… లంక బౌలర్లు, ఫీల్డర్లు… ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. కొందరైతే… లైవ్ మ్యాచ్ చూస్తున్నామా? లేక హైలెట్స్ చూస్తున్నామా? అని కూడా ఫీలయ్యారు. ఏకంగా 220 స్ట్రైక్రేట్తో… లంక బౌలర్లకు చుక్కలు చూపించాడు… సూర్య. ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాదుతూ… 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ ముగిసే సమయానికి 51 బంతుల్లోనే 112 రన్స్ చేసి నాటౌట్ గా మిగిలాడు. ఓవర్లు పూర్తై పోయాయి కాబట్టి సరిపోయింది కానీ… ఇంకా ఉంటే మాత్రం.. సూర్య విధ్వంసం కొనసాగేదే.
ఈ మ్యాచ్ లోనూ కొత్త రికార్డు నెలకొల్పాడు.. సూర్య. టీ-20ల్లో ఓపెనర్ గా కాకుండా మరో స్థానంలో క్రీజులోకి వచ్చి మూడు సెంచరీలు బాదిన తొలి బ్యాటర్ సూర్యే. ఇక టీ-20ల్లో 4 సెంచరీలతో రోహిత్ శర్మ తొలి స్థానంలో ఉండగా… మూడు శతకాలతో మ్యాక్స్వెల్, మన్రో సరసన నిలిచాడు… సూర్య. భారత్ తరఫున రోహిత్ 35 బంతుల్లోనే సెంచరీ సాధిస్తే… రోహిత్ 45 బంతుల్లో సెంచరీ సాధించాడు. రోహిత్ తర్వాత భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ సూర్యదే. రోహిత్ 154 మ్యాచుల్లో 4 సెంచరీలు సాధిస్తే… సూర్య కేవలం 45 మ్యాచుల్లోనే 3 సెంచరీలు సాధించాడు. సూర్య విధ్వంసం ఇలాగే కొనసాగితే… టీ-20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కడం ఖాయం.