సౌతాఫ్రికాతో జరగాల్సిన మొదటి టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సునీల్ గవాస్కర్ సీరియస్ అయ్యారు. ఎవరికీ తెలీని రహస్యాన్ని ఒకటి చెప్పారు. అదేమిటంటే వర్షం పడేటప్పుడు డర్బన్ లోని కింగ్స్మీడ్ స్టేడియంలో గ్రౌండ్ అంతా కప్పేందుకు అవసరమైన కవర్ లేదని బాంబ్ పేల్చారు. అందువల్లనే అవుట్ ఫీల్డ్ అంతా తడిసిపోవడంతో అంపైర్లు మొత్తం మ్యాచ్ నే రద్దు చేసి పారేశారన్నారు.
వర్షం పడుతున్నప్పుడు కేవలం పిచ్ వరకే కవర్లు కప్పారని, మిగిలినదంతా అలా వదిలేశారని చెప్పారు. నిజానికి గ్రౌండ్ అంతా కప్పడానికి అవసరమైన డబ్బులు క్రికెట్ సౌతాఫ్రికా వద్ద లేవా ? అని సూటిగా ప్రశ్నించారు. నిజానికి ఇండియా దగ్గర ఉన్నంత డబ్బులు ఎవరి వద్దా ఉండకపోవచ్చు.. కానీ ఒక గ్రౌండ్ కప్పేంత కవర్ కొనడానికి కూడా లేవా ? అని ఆశ్చర్యపోయారు. మరి ఆ మాత్రం దానికి అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించడం ఎందుకు ? అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
సాధారణంగా వర్షం కురుస్తున్న సమయంలో ఏ క్రికెట్ స్టేడియంలో నైనా, మైదానంలోని నలుమూలలా కవర్లతో కప్పి ఉంచుతారు. దీనివల్ల వర్షం తగ్గితే, ఒక గంట తర్వాత మ్యాచ్ ప్రారంభించే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రౌండ్ పై కప్పిన కవర్ అంతా తీసి, మళ్లీ సెట్ చేయడానికి ఆ సమయం పడుతుంది. లేదంటే మరో గంట ఎక్కువ సమయం పడుతుంది. ఆ ఒక్క కవర్ లేకపోవడం వల్ల మ్యాచ్ మొత్తం రద్దయిపోయంది కదా.. అని ఆవేదన వ్యక్తం చేశారు.
2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా కూడా చాలా మ్యాచులకు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్ లు రద్దు కావడం, అలాగే చాలా జట్లు పాయింట్లు కోల్పోయాయి. కొందరు గెలిచే స్థితిలో ఉండి ఓడిపోయారు. అస్సలు పెర్ ఫార్మెన్స్ చేయలేని వాళ్లకి ఆయాచితంగా పాయింట్లు వచ్చేశాయి. అదే మెగా టోర్నమెంట్ లో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్న కారణంగా శ్రీలంక జట్టు సైతం రెండు మ్యాచుల్లో ప్రత్యర్థితో కలిసి పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. అలాగే దక్షిణాఫ్రికా-వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరగలేదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
చాలా సమయాల్లో ఒక అంతర్జాతీయ మ్యాచ్ పై కొన్ని కోట్ల రూపాయల ఖర్చుపెడుతుంటారు. అది అర్థాంతరంగా ఆగిపోతే అందరికీ నష్టమేనని గవాస్కర్ చెబుతున్నారు. ఈ విషయాలన్నీ క్రికెట్ సౌతాఫ్రికా నేర్చుకోవాలని అన్నాడు.