Sunil Gavaskar : చాలాకాలం నుంచి మీడియాకి దూరంగా ఉన్న సునీల్ గవాస్కర్ ఈమధ్య బయటకి వచ్చి టీమ్ ఇండియాపై మళ్లీ కామెంట్స్ చేయడం ప్రారంభించాడు. ఒకప్పుడు ఎడతెగని వివాదాలతో సహవాసం చేసిన గవాస్కర్, ఒకట్రెండేళ్లుగా ట్రెండింగ్ లోకి రావడం లేదు. ఏదో ఎప్పుడో అడపాదడపా వచ్చి, ఏదో నాలుగు ముక్కలు మాట్లాడి, నేను కూడా ఉన్నానని గుర్తు చేస్తుంటాడు.
తాజాగా వరుసగా రెండు మూడు ట్వీట్లు వదిలాడు. అందులో ఒకటి టీమ్ ఇండియాలో ఓపెనర్స్ పోటీ ఎక్కువ కావడమే. ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం ముగ్గురు ఓపెనర్స్ ఉన్నారు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరూ ఆస్ట్రేలియా టీ 20 సిరీస్ లో ఇరగ్గొట్టారు. సౌతాఫ్రికా టీమ్ లోకి మళ్లీ శుభ్ మన్ గిల్ వచ్చాడు. దీంతో ముగ్గురయ్యారని తెలిపాడు.
ఇక వచ్చే టీ 20 వరల్డ్ కప్ కి కెప్టెన్ రోహిత్ శర్మ వస్తున్నాడు. దీంతో నలుగురు అవుతారు. మరో వైపు వికెట్ కీపర్ కమ్ ఇషాన్ కిషన్ ఉండనే ఉన్నాడు. అతను వచ్చీ పోతుండటంతో లెక్క పెట్టడం లేదుగానీ, ఉంటే అతనితో కలిపి ఐదుగురు ఓపెనర్లు అవుతారని అన్నాడు.
ఇంతమంది ఓపెనర్స్ ఉండటం మంచిదేనని జట్టు పరంగా మంచిదేనని అన్నాడు. ఇది సవాల్ తో కూడుకున్న సమస్యని అన్నాడు. అందరూ బాగా ఆడుతున్నారు. ఎవరిని తీయాలి? ఎవరిని ఆడించాలనేది టీమ్ ఇండియా మేనేజ్మెంట్, హెడ్ కోచ్ రాహుల్ కి పెద్ద తలపోటు గా మారిందని అన్నాడు. అయితే దీనినెలా అధిగమిస్తారో చూడాల్సిందేనని అన్నాడు.
ఇంత చెప్పిన సునీల్ గవాస్కర్ ఒక సీనియర్ గా సలహా కూడా చెప్పి ఉంటే బాగుండేదని పలువురు కామెంట్ చేస్తున్నారు. సమస్యని అందరిలా చర్చిస్తే, మీ సీనియారిటీకి విలువ ఏముంది? కామన్ మేన్ లా మాట్లాడినట్టే ఉంటుంది..
మీరే అక్కడ ఉంటే, ఏం చేస్తారనేది చెప్పాల్సింది, లేదా బయట నుంచి ఆ కాంబినేషన్, అక్కడ సౌతాఫ్రికా పిచ్ లు, గతంలో వారిపై ఎవరు బాగా ఆడారు? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని మీ ఆలోచన చెబితే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.