Sri Lanka’s Captain Charith Asalanka Talks About Loss to India in 3rd T20I: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో.. సూర్యా కెప్టెన్సీ మాయలో చిక్కుకుని శ్రీలంక పరాజయం పాలైంది. వారికి పెద్ద ఒత్తిడి కూడా లేదు. అప్పటికి 2 వికెట్లు మాత్రమే పడ్డాయి. చివర్లో బాల్ కి ఒక రన్ చొప్పున తీసినా చాలు.. సులువుగా గెలిచే మ్యాచ్ ని సూపర్ ఓవర్ వరకు తెచ్చుకుని పరాజయం పాలయ్యారు.
నిజానికి టీమ్ ఇండియా బ్యాటింగు కూడా అంత గొప్పగా లేదు. ఒక దశలో48 పరుగులకి 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆ దశలో శుభ్ మన్ గిల్ ఇలాగే సింగిల్స్ తీస్తూ నెమ్మదిగా బండి లాగించాడు. ఓపెనర్ గా వచ్చి ఆరో వికెట్ గా వెనుతిరిగాడు. ఆ ఆట చూసి కూడా శ్రీలంక బ్యాటర్లు నేర్చుకోలేదని నెటిజన్లు అంటున్నారు. త్వరత్వరగా నాలుగు షాట్లు కొట్టి మ్యాచ్ ని ఘనంగా ముగించాలనుకుని.. విజయం ముందు పల్టీలు కొట్టారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో శ్రీలంక కొత్త కెప్టెన్ చరిత్ అసలంక మాట్లాడుతూ తమ జట్టు ఓటమికి కారణాలు చెప్పాడు. మా మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. నాతో సహా, మావాళ్ల ప్రదర్శన బాగాలేదు. చెత్త షాట్లు కొట్టి అవుట్ అయ్యామని అన్నాడు. బంతి పాతది అయ్యే కొద్ది, పరిస్థితికి తగ్గట్లుగా షాట్ సెలక్షన్ ఉండాలి.
అలా జరగలేదని అన్నాడు.
Also Read: ఒలింపిక్స్ లో నేడు భారత షెడ్యూల్
ఇంకా మాట్లాడుతూ ఈ పిచ్లపై బ్యాటింగ్ కష్టమే. కానీ ఛేజింగ్ చేయగలిగే స్కోరే ఇదని అన్నాడు. మా బౌలర్లు అద్భుతంగా బౌలింగు చేసి టీమ్ ఇండియాను నియంత్రించారు. కానీ బ్యాటింగు వైఫల్యంతో ఓటమి పాలయ్యామని అన్నాడు. ఈ వైఫల్యానికి సాకులు చెప్పడానికి లేదని అన్నాడు. 137 పరుగులు పెద్ద టార్గెట్ కాదని అన్నాడు.
ప్రొఫెషనల్ క్రికెటర్లుగా మేం ఇంకా మెరుగ్గా ఆడాల్సి ఉంది. హసరంగను బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపించిన వ్యూహాం ఫలించలేదు. ఇక రాబోయే వన్డేల్లో అయినా కాస్త మంచి బ్యాటింగ్ ప్రదర్శన చూడాలనుకుంటున్నాను. మా టాప్ ఆర్డర్ మాత్రం బ్రహ్మాండంగా ఆడుతోందని అన్నాడు. వారిచ్చిన పికప్ ని మిడిల్ ఆర్డర్ అందుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆగస్టు 2 నుంచి రోహిత్ శర్మ కెప్టెన్సీలో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది.