South Africa Vs India : వర్షం కారణంగా దక్షిణాఫ్రికాతో తొలి టీ20 రద్దు కావడంతో భారత కుర్రాళ్లు విలువైన మ్యాచ్ సమయం కోల్పోయారు. వరుణుడు కరుణించాలని ఆశిస్తూ నేడు.. రెండో టీ20కి సిద్ధమయ్యారు. ఈ మ్యాచ్కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. వాన వల్ల డర్బన్లో టాస్ కూడా పడలేదు. టీ-20 ప్రపంచకప్కు ముందు భారత్కు ఇప్పుడు అయిదు మ్యాచ్లే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చే ఏడాది జూన్లో జరిగే మెగా టోర్నీకి జట్టు ఎంపికలో ఆటగాళ్ల ఐపీఎల్ ప్రదర్శన కీలకం కానుంది. ప్రస్తుత సిరీస్కు సెలక్షన్ కమిటీ.. 17 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. మిగిలిన ఈ రెండు మ్యాచ్ల్లో అందరికీ అవకాశం దొరకడం కష్టం.
ఆస్ట్రేలియాతో సిరీస్లో ఆకట్టుకున్న వికెట్కీపర్ బ్యాటర్ జితేశ్ శర్మ.. దక్షిణాఫ్రికాపైనా ఆడే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్లో మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నప్పటికీ రుతురాజ్కు ఇక్కడ ఆడే అవకాశం లభిస్తుందా అన్నది సందేహమే. ఆ సిరీస్కు విశ్రాంతి తీసుకున్న శుభ్మన్ గిల్.. యశస్వి జైస్వాల్తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్, రింకులతో బ్యాటింగ్ లైనప్ బాగానే కనిపిస్తోంది. సిరాజ్, అర్ష్దీప్, ముకేశ్ కుమార్ పేస్ బాధ్యతలు పంచుకోవచ్చు. ఇక స్పిన్ విభాగంలో జడేజాకు తోడుగా రవి బిష్ణోయ్ను ఆడించే అవకాశముంది.
వాతావరణం ఆటకు అనుకూలంగా లేదు. రెండో టీ20కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ సజావుగా సాగడం అనుమానమే. మ్యాచ్ వేదిక సెయింట్ జార్జ్ పార్క్లో పిచ్ స్వభావాన్ని అంచనా వేయడం కష్టమే. ఇక్కడ కొన్నిసార్లు బ్యాటర్లు, కొన్నిసార్లు బౌలర్లు సత్తా చాటారు. ఆరంభంలో పిచ్ నుంచి పేస్ బౌలర్లకు సహకారం లభించవచ్చు. ఛేదనలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.