500 ఏళ్ల తర్వాత దేశ ప్రజల సుదీర్ఘకల సాకారం అవుతోంది. ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవానికి దేశ విదేశాల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎంతో మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వేలాదిగా ప్రముఖులు శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠోత్సవానికి హాజరవుతున్నారు. వీరితో పాటు శ్రీరామ భక్తులు లక్షలాది మంది రానున్నారు.
ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవానికి ముందే రామ భక్తుల నుంచి వచ్చే ఒత్తిడిని తట్టుకోలేక సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవం ఒక్కరోజు ఆగమని విజ్ణప్తి చేశారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఈ క్రమంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ భారతీయులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఇప్పుడది వైరల్గా మారింది.
“అందరికీ నమస్తే..అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం, శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ఠోత్సవ నేపథ్యంలో ప్రపంచమంతా శాంతి, సామరస్యం వెల్లివిరియాలి. అలాగే దక్షిణాఫ్రికాలో ఉంటున్న భారతీయులు అందరికీ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖశాంతులతో వర్థిల్లాలి. ప్రపంచమంతా ఆనందాలు వెల్లివిరియాలి. జై శ్రీరామ్” అని చెప్పుకొచ్చాడు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రముఖ క్రికెటర్ హర్భజన్ సింగ్ కి ఆహ్వానం అందింది. అయితే కాంగ్రెస్ పార్టీ అయోధ్య ప్రారంభోత్సవాన్ని బాయ్ కట్ చేసిన నేపథ్యంలో హర్భజన్ పై ఒత్తిడి పెరిగింది. తనని వెళ్లవద్దని చెప్పేసరికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేను అయోధ్యకి వెళుతున్నాను. మీరెవరు నన్ను ఆపడానికని ప్రశ్నించాడు. ఇది నా వ్యక్తిగతం. శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని తెలిపాడు. కాంగ్రెస్ పార్టీ నన్నేం చేసినా సరే, వెళతానని అన్నాడు.
ప్రముఖ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్ , రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కొహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ ఇలా పలువురు క్రికెటర్లకు ఆహ్వానాలు అందాయి. జనవరి 25 నుంచి హైదరాబాద్ లో టెస్ట్ క్రికెట్ ప్రారంభం కానుందున అప్పుడే చాలామంది ప్రాక్టీసులో పాల్గొంటున్నారు. అందువల్ల ఇప్పుడు ఆడేవాళ్లు వెళ్లలేకపోవచ్చునని చెబుతున్నారు.