Ganguly Kolkata Doctor Murder| కోల్కతా డాక్టర్ హత్యాచార కేసుపై చాలామంది సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇదే కోవలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా బెంగాల్ లో జరిగిన పైశాచిక ఘటనపై కామెంట్లు చేశారు. అయితే ఆయన కామెంట్లు కాస్త వివాదాస్పదమయ్యాయి. ఆయన చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని ఒక సినీ నటి విమర్శలు చేసింది. దీంతో గంగూలీ తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో వారం రోజుల క్రితం ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ పై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసిన ఘటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు సాగుతున్నాయి. ముఖ్యంగా డాక్టర్లు దేశవ్యాప్త సమ్మె చేస్తున్నారు. ఈ నిరసనల నిప్పులో రాజకీయ పార్టీలు చలికాచుకుంటున్నాయి. బెంగాల్ లోని మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితులను కాపాడుతోందనే విమర్శలు బిజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఇప్పటికే పలుమార్లు చేశారు. బెంగాల్ లో మహిళలకు రక్షణ లేదని మాటల తూటాలు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ సౌరవ గంగూలీ.. పశ్చిమ బెంగాల్ సురక్షిత ప్రదేశమేనంటూ వ్యాఖ్యలు చేయడంపై బెంగాలీ నటి శ్రీ లేఖ మిత్రా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక మహిళా డాక్టర్ ను రాక్షసంగా హత్య చేస్తే.. గంగూలీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా?. ఆయన చాలా బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేశారని శ్రీలేఖ మండిపడింది. అంత కృూరంగా ఒక మహిళను చంపితే ఇది సాధారణ సంఘటన అని గంగూలీ చెప్పడం దారుణంగా ఉందని మండిపడింది. ”ఓ క్రికెటర్ గా గంగూలీని, ఆయన టీవి ను మా నెత్తిన పెట్టుకున్నాం. కోల్ కతా యువరాజు అని.. మహారాజా అని.. ఆయనను పిలిచినందుకు మాకు ఆయన బుద్ధీ వచ్చేలా మాట్లాడారు. అంత పైశాచిక ఘటనకు సాధారణ ఘటన అని చెప్పడానికి ఆయనకు నోరెలా వచ్చింది?” అని శ్రీలేఖ గంగూలీపై మండిపడింది.
మరోవైపు గంగూలీ.. శ్రీ లేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తన మాటలను ఆమె తప్పుగా అర్థం చేసుకున్నదని అన్నారు. మహిళా డాక్టర్ హంతకులను కఠినంగా శిక్షించాలని, ఆమెపై జరిగిన హత్యాచారం ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని గంగూలీ తెలిపారు.
Also Read: కోల్ కతా వైద్యురాలి హత్యపై రాజకీయ దుమారం.. నిందితుడిని ప్రభుత్వం కాపాడుతోందా?..
గంగూలీ అసలేం చెప్పారంటే.. కోల్ కతా ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ జూనియర్ మహిళా డాక్టర్ పై జరిగిన హత్యాచార ఘటనపై గంగూలీ తొలిసారి స్పందిస్తూ.. ”దోషులను కఠినంగా శిక్షించాలి. అయితే ఈ ఒక్క ఘటనతో పశ్చిమ బెంగాల్ సురక్షితంగా లేదనే వాదన సరికాదు. ఇది చాలా దురదృష్టకరమైన ఘటన. నిజంగా అత్యంత క్రూర చర్య. ఇలాంటి ఘటనలు ఒక్క బెంగాల్ లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. అయినా ఇలాంటి ఒకటీ రెండు ఘటనలతో దేశంలో భద్రత లేదనే వాదన తప్పు. మన దేశంలో, బెంగాల్ రాష్ట్రంలో మంచి భద్రత ఏర్పాట్లు ఉన్నాయి. అయితే ఇలాంటి దురదృష్టకర ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేలా చూడాలి. కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆస్పత్రుల్లో కట్టదిట్టమైన భద్రత కల్పించాలి. ” అని మీడియాతో చెప్పారు.