Cricket News: స్మృతి మంధాన లేడీ క్రికెట్ స్టార్. ఈ స్టైలిష్ ప్లేయర్ క్రీజులో అడుగుపెడితే అభిమానులు కేరింతలు కొడుతారు. ఒక్కో షాట్తో అందరినీ ఆకట్టుకుంటారు. జట్టుకు కీలక సమయంలో చేయూతనిచ్చి విజయాలను అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. క్రికెట్ గ్రౌండ్లోనే కాదు.. వెలుపల కూడా ఆమెకు విశేషమైన ఆదరణ ఉన్నది. ఆమె పర్సనల్ లైఫ్ విషయంలోనూ అభిమానులు ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆమె పర్సనల్ విషయమొకటి సోషల్ మీడియాలో వెల్లడించారు. తాను పలాష్ ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నట్టు తెలిపారు. పలాష్ వృత్తిరీత్యా సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తి. దీంతో సహజంగానే వీరిద్దరిపై ముందు నుంచీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి.
స్మృతి మంధాన గురించి ఆసక్తికర విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆమె లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్విమెన్గా అందరికీ తెలుసు. కానీ, ముందుగా ఆమె రైట్ హ్యాండర్గానే బ్యాట్ ఝుళిపించారు. అయితే, తన తండ్రి కోరిక మేరకు ఆమె లెఫ్ట్ హ్యాండర్గా మారారు. ఇందుకోసం ముందుగా స్మృతి మంధాన తండ్రి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
స్మృతి మంధాన కుటుంబానికి క్రికెట్ నేపథ్యం ఉన్నది. తండ్రి, సోదరుడు క్రికెట్లో రాణించారు. స్మృతి మంధానకు క్రికెట్ అంటే ఇష్టం సోదరుడు శ్రవణ్ వల్లే ఏర్పడింది. శ్రవణ్ను అనుకరిస్తూ నిజంగానే క్రికెట్ పై ఆసక్తి, ఇష్టం పెంచుకున్నారు. ఈ రోజు ఆమె అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్గా ఎదిగారు.
Also Read: రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ నిధులు విడుదల
స్మృతి మంధాన తండ్రి జిల్లా స్థాయి వరకు క్రికెట్ ఆడారు. ఆ తర్వాత కూడా ఆయన క్రికెట్ను ఆరాధిస్తూనే ఉన్నారు. తన పిల్లలు క్రికెట్ ప్లేయర్లుగా రాణించడంపై గర్వపడ్డారు. ఆయన కొడుకు శ్రవణ్ మహారాష్ట్ర అండర్ 19 టీమ్కు ప్రాతినిధ్యం వహించారు. స్మృతి మంధాన తండ్రికి రైట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ కంటే కూడా లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్ అంటేనే ఎక్కువ ఇష్టం. తండ్రికి ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్ ఇష్టం కాబట్టి.. ఆమె కూడా తన సోదరుడిలాగే లెఫ్ట్ హ్యాండర్గా మారిపోయారు. ఆమె లెఫ్ట్ హ్యాండర్గానూ అద్భుతంగా రాణిస్తున్నారు. ఏకంగా అంతర్జాతీయ ప్లేయర్గా ఎదిగారు.