SL vs IND 3rd ODI Highlights(Sports news in telugu): శ్రీలంక వన్డే సిరీస్ ఆడేందుకు అసలు ఇష్టమే లేనట్టుగా సీనియర్లు వ్యవహరించారు. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగు పరంగా పర్వాలేకున్నా కెప్టెన్ గా అట్టర్ ఫెయిల్యూర్ అయ్యాడు. బౌలింగు కేటాయింపులు అధ్వానంగా ఉన్నాయి. ఇన్ని కారణాలతో ప్రపంచ క్రికెట్ లో ఆఖరి స్థానంలో ఉన్న శ్రీలంక చేతిలో టీమ్ ఇండియా చిత్తుగా ఓడిపోవడమే కాదు.. సిరీస్ కూడా కోల్పోయింది.
జట్టులో రెండు మార్పులతో టీమ్ ఇండియా బరిలోకి దిగింది. రాహుల్ ప్లేస్ లో రిషబ్ పంత్ వచ్చాడు. కొత్తగా వన్డేల్లోకి రియాన్ పరాగ్ ఆరంగేట్రం చేశాడు. అయితే అర్షదీప్ ని పక్కన పెట్టారు. ఒకే ఒక పేసర్ సిరాజ్ తో టీమ్ ఇండియా బరిలోకి దిగింది.
సెకండ్ బ్యాటింగ్ కి వచ్చేసరికి విపరీతంగా టర్న్ అయ్యే పిచ్ కారణంగా టీమ్ ఇండియా ఓటమి పాలైంది. అయితే మూడుసార్లు ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. దానిని అడ్వాంటేజ్ గా తీసుకున్న శ్రీలంక పిచ్ బాగున్నప్పుడు వారు బ్యాటింగ్ చేసి, బాగా లేనప్పుడు టీమ్ ఇండియాని పిలిచి ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల నీళ్లు తాగించారు.
Also Read : ‘మా అమ్మాయికి సాధారణ ఉద్యోగం చాలు’.. రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన యువతి తల్లిదండ్రులు!
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరిగిన సిరీస్ మూడో వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి మొదట బ్యాటింగు తీసుకుంది. 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో టీమ్ ఇండియా 26.1 ఓవర్లలో 138 పరుగులకి ఆలౌట్ అయ్యి 110 రన్స్ తేడాతో ఘోర పరాజయం పాలైంది.
27 ఏళ్ల తర్వాత శ్రీలంకతో సిరీస్ కోల్పోయి, తీవ్రమైన అవమాన భారంతో ఇండియాకి తిరిగి వస్తోంది. ఇకపోతే గౌతంగంభీర్ కి మిశ్రమ ఫలితాలు దక్కాయి. టీ 20 సిరీస్ గెలిస్తే, వన్డే సిరీస్ లో ఓటమి మిగిలింది.
249 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా ఏ దశలో కూడా ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. మొదటి నుంచి చివరి వరకు ఆల్ రౌండర్లతో కలిపి తొమ్మిది మంది బ్యాటర్లు ఉన్నారు. అందరూ చేతులెత్తేశారు. ఇక ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ ఎప్పటిలా ఎటాకింగ్ బాగానే ఆడాడు. క్రీజులో ఉన్నంత సేపు అసహనంగానే కనిపించాడు. ఇలా 20 బంతుల్లో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇందులో 6 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్.. మరి తన ఆటేమిటో, తీరేమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు వరుసపెట్టి సెంచరీలు చేసిన ఆటగాడు ఇలా ఎందుకు ఆడుతున్నాడని అందరూ బుర్రలు పట్టుకుంటున్నారు. ఈసారి కేవలం 6 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు.
Also Read : వినేశ్ ఫొగాట్, రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి.. అధికారులు ఏం చేశారు ?
ఆపద్భాంధవుడిలా ఆదుకుంటాడనుకున్న కొహ్లీ కూడా ఎక్కువ సేపు నిలవలేదు. 20 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. రిషబ్ పంత్ చిచ్చరపిడుగులా ఆడతాడనుకుంటే 6 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఇలాగే శ్రేయాస్ అయ్యర్ (8), అక్షర్ పటేల్ (2), రియాన్ పరాగ్ (15), శివమ్ దూబె (9), కులదీప్ (6) ఇలా చేసి అవుట్ అయ్యారు.
అయితే చివర్లో వాషింగ్టన్ సుందర్ మెరుపులు మెరిపించాడు. 3 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. దాంతో 138 పరుగులైనా వచ్చాయి. లేదంటే 100లోపే ఆల్ అవుట్ అయిపోయేవారు. మొత్తానికి 26.1 ఓవర్లలో మ్యాచ్ ని ముగించి, పండులా సిరీస్ తో సహా శ్రీలంక చేతిలో పెట్టారు. ఇక మూడు వన్డేల సిరీస్ లో తొలి వన్డే టైగా ముగిసింది. తర్వాత రెండు వన్డేలు శ్రీలంక గెలిచి సిరీస్ వశం చేసుకుంది.
శ్రీలంక బౌలింగులో ఈసారి దునిత్ వెల్లెంగే 5 వికెట్లు తీసి టీమ్ ఇండియాని వణికించాడు. రెండో వన్డే హీరో వాండర్సేకి 2 వికెట్లు పడ్డాయి. తీక్షణ 2, అసితా ఫెర్నాండో 1 వికెట్ తీశారు.
అంతకుముందు బ్యాటింగు ప్రారంభించిన శ్రీలంక ఎప్పటిలా సింగిల్స్ కి ప్రాధాన్యత ఇచ్చింది. వికెట్లను కాపాడుకుంటూ ఒకొక్క రన్ తీస్తూ స్కోరు బోర్డుని నెమ్మదిగా కదలించింది. ఆ విధానం టీమ్ ఇండియాలో కొరవడింది. అయితే శ్రీలంక ఓపెనర్ నిస్సాంక (45) చేసి అవుట్ అయ్యాడు.
మొదటి వికెట్ తీయడానికి టీమ్ ఇండియాకి దాదాపు 20 ఓవర్లు పట్టాయి. ముక్కుతూ మూల్గుతూ నిస్సాంక వికెట్ తీశారు. కొత్తగా ఆరంగేట్రం చేసిన ఓపెనర్ అవిష్క ఫెర్నాండో తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. తను 102 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 96 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కుశాల్ మెండిస్ (59), కెప్టెన్ అసలంక (10), సదీర సమరవిక్రమ (0), జనిత్ (8), వెల్లంగే (2) ఇలా అవుట్ అయ్యారు. మొత్తానికి శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది.
టీమ్ఇండియా బౌలింగులో సిరాజ్ ని చితక్కొట్టి వదిలారు. 9 ఓవర్లలో 78 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 1, వాషింగ్టన్ సుందర్ 1, కులదీప్ 1, రియాన్ పరాగ్ 3 వికెట్లు పడగొట్టారు.