BCCI Awards : బీసీసీఐ ప్రతీ ఏడాది వార్షిక అవార్డులను ఇస్తుంటుంది. అయితే కోవిడ్ నేపథ్యంలో ఇవి ఆగిపోయాయి. మళ్లీ వీటిని తిరిగి ప్రారంభించాలని బీసీసీఐ భావించింది. ఒక ఏడాది క్యాలెండర్లో అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు పాలీ ఉమ్రిగర్ అవార్డును ఇస్తారు. అలాగే మాజీ ఆటగాళ్లకు సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందజేస్తారు.
ఈ నేపథ్యంలో 2023 సంవత్సరానికి అత్యుత్తమ ప్రదర్శన చేసిన శుభ్ మన్ గిల్ కి ఈ అవార్డు దక్కింది. 48 మ్యాచ్ల్లో గిల్ 2154 పరుగులు చేసి తను ముందు వరుసలో ఉన్నాడు. అయితే 35 మ్యాచ్ల్లో 2048 పరుగులు చేసిన కోహ్లీ తన వెనుకే ఉన్నాడు. అలాగే 2023 వన్డే వరల్డ్ కప్ లో విరాట్ కొహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా కూడా ఎంపికయ్యాడు. కాకపోతే వన్డేల్లో వేగంగా 2000 పరుగులు సాధించిన గిల్ను ఉత్తమ క్రికెటర్ అవార్డుకు బీసీసీఐ ఎంపిక చేయడం విశేషం.
సీకే నాయుడు లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డుకు రవిశాస్త్రిని ఎంపిక చేసింది. హైదరాబాద్ లో జనవరి 23న జరిగే వేడుకలో వీటిని అందజేయనున్నారు. జనవరి 25 నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్ కోసం ఆటగాళ్లు అందరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. వీరంతా బీసీసీఐ నిర్వహించే కార్యక్రమానికి హాజరవనున్నారు. నాలుగేళ్ల తర్వాత ఈ అవార్డు ఫంక్షన్ ను మళ్లీ బీసీసీఐ నిర్వహిస్తోంది. 2020 జనవరిలో చివరిసారిగా నిర్వహించారు.
అవార్డు అందుకుంటున్న శుభ్ మన్ గిల్ కెరీర్ ప్రస్తుతం ఒడిదుడుకుల మధ్య సాగుతోంది. తాజాగా జరిగిన ఆఫ్గాన్ టీ 20 లో చివరి రెండు మ్యాచ్ లకు తనని టీమ్ ఇండియా నుంచి తప్పించారు. యశస్వి జైశ్వాల్ కి అవకాశం ఇచ్చారు. అయితే బ్రహ్మాండంగా ఆడిన గిల్ ఒక్కసారి ఫామ్ కోల్పోవడంతో తిరిగి ట్రాక్ ఎక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు
అయితే కెప్టెన్ రోహిత్ శర్మతో విభేదాలున్నాయనే ఆరోపణలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అందుకనే గిల్ ని 11 మంది టీమ్ లో ఎంపిక చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.మరోవైపు బెంచ్ మీద ప్రతిభావంతులైన ఆటగాళ్లు క్యూ లో ఉండటంతో, తనకి టీమ్ మేనేజ్మెంట్ అవకాశాలు ఇవ్వలేకపోతోంది. మరి టెస్ట్ జట్టులో ఎలా ఆడతాడో వేచి చూడాలి.