Shubman Gill : ఇండియన్ క్రికెట్ లోకి వచ్చిన అనతికాలంలోనే సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు. రికార్డుల మోత మోగించాడు. ఇండియన్ క్రికెట్ కి భవిష్యత్ ఆశా కిరణంగా అవతరించాడు. అతను మరెవరో కాదు 24 ఏళ్ల యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్. ఇప్పుడు తన ఖాతాలో మరో అరుదైన రికార్డ్ వచ్చి చేరింది. అదే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు. అయితే ఇందులో మరో రికార్డు కూడా దాగి ఉంది. అదేమిటంటే ఈ అవార్డుకి రెండుసార్లు ఎంపికైన తొలి భారతీయ క్రికెటర్ గా అతను కొత్త రికార్డు సృష్టించాడు.
ఐసీసీ ప్రతీనెలా ఉత్తమ ఆటగాళ్ల అవార్డులను ప్రకటిస్తోంది. అలా ఈ ఏడాది సెప్టెంబరు నెలకుగాను గిల్ కి అవార్డు ప్రకటించింది. అయితే గిల్ తో పాటు ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ మలాన్, ఇండియన్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా పోటీ పడ్డారు. కానీ వీరిద్దరిని దాటి గిల్ అవార్డు పట్టేశాడు.
ఈ ఏడాది జనవరి నెలలో కూడా గిల్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకున్నాడు. మళ్లీ 8 నెలల తర్వాత మరొకటి అందుకున్నాడు. ఒకే ఏడాది రెండు అవార్డులతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లో నెంబర్ 2 స్థానానికి చేరిపోయాడు.
2023 సెప్టెంబర్ నెలలో మొత్తం 8 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన గిల్ రెండు సెంచరీలు చేశాడు. ఆరు సార్లు 50కి పైగా స్కోరు చేశాడు. మొత్తమ్మీద 80 సగటుతో 480 పరుగులు చేశాడు. ఇప్పటివరకు 35 వన్డే మ్యాచ్ లు ఆడిన గిల్ 1917 రన్స్ చేశాడు. వైరల్ ఫీవర్ తో బాధపడి ప్రపంచకప్ లో రెండు మ్యాచ్ లకు దూరమైన గిల్ అహ్మదాబాద్ లో బ్యాట్ పట్టి ప్రాక్టీస్ చేశాడు.