Shubman Gill Makes History as 1st Indian Captain to Win 4 T20Is Abroad: శుభ్ మన్ గిల్ కెప్టెన్ గా తొలి సిరీస్ లోనే చరిత్ర సృష్టించాడు. అద్భుతమైన ఒక రికార్డును సొంతం చేసుకున్నాడు. జింబాబ్వేతో జరిగిన టీ 20 సిరీస్ ను టీమ్ఇండియా 4-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ ఓటమి పాలై, తర్వాత నుంచి హరారే లో పిచ్ పరిస్థితి అర్థం చేసుకుని మనవాళ్లు అదరగొట్టారు. అయితే ఒకటే గ్రౌండులో 5 మ్యాచ్ లు జరగడం వల్ల టీమ్ ఇండియా యువ జట్టుకి కలిసి వచ్చిందని అంటున్నారు. అదే నాలుగైదు గ్రౌండులు తిప్పి ఉంటే, కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురై ఉండవచ్చునని అంటున్నారు.
ఇకపోతే ఇంతకీ గిల్ సాధించిన రికార్డ్ ఏమిటంటే, ఒక ద్వైపాక్షిక టీ 20 సిరీస్ లో విదేశీ గడ్డపై నాలుగు విజయాలు సాధించిన తొలి కెప్టెన్ గా శుభ్ మన్ గిల్ రికార్డు సృష్టించాడు. భారత్ టీ 20 జట్టుకు 14వ కెప్టెన్ అయిన గిల్.. కన్నా ముందు రోహిత్ శర్మ (50), ధోనీ (42), విరాట్ కొహ్లీ (32), పాండ్యా (10), సూర్యకుమార్ (5) తర్వాత అత్యధిక విజయాలు సాధించిన భారత్ కెప్టెన్ గా గిల్ రికార్డులకెక్కాడు.
మొత్తం 5 టీ 20 మ్యాచ్ లు ఆడిన గిల్ 170 పరుగులు చేశాడు. వరుసగా చూస్తే 31,2, 66, 58, 13 ఇలా ఆడాడు. అయితే నాలుగో వన్డేలో యశస్వి సెంచరీకి అడ్డం పడ్డాడనే విమర్శలు వినిపించాయి. అలాగే మూడో వన్డేలో 66 పరుగులు చేసినా, మొదటంతా జిడ్డు బ్యాటింగ్ చేసి, చివర్లో ధనాధన్ ఆడి బాల్స్ వ్యత్యాసాన్ని కవర్ చేశాడనే విమర్శలు వచ్చాయి. నలుగురు ఓపెనర్స్ జట్టులో ఉన్నప్పుడు, తను త్యాగం చేయాల్సింది పోయి, జట్టుని ఇబ్బందిపెట్టాడనే విమర్శలు వినిపించాయి.
Also Read: అనుభవం లేకున్నా అదరగొట్టారు: శుభ్ మన్ గిల్
గిల్ ఒకరకంగా రికార్డు సాధించినా, కెప్టెన్ గా కరెక్ట్ కాదనే విమర్శలు వినిపించాయి. కెప్టెన్ అంటే త్యాగాలకు సిద్ధంగా ఉండాలి, జట్టుని నడిపించేవాడై ఉండాలని సూచిస్తున్నారు. అవి గిల్ లో కనిపించలేదని చెబుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే నాయకత్వ లక్షణాలు లేవని అంటున్నారు.