IND Vs AFG 1st T20i : టీమ్ ఇండియా కుర్రాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా ఆల్ రౌండర్ శివమ్ దూబె శివాలెత్తడంతో 6 వికెట్ల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేసి దూబె నాటౌట్ గా నిలిచాడు.
మొహలీ వేదికగా జరిగిన తొలి టీ 20 మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. తర్వాత లక్ష్యాన్ని టీమ్ ఇండియా 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అలా కొత్త సంవత్సరం టీ 20 మ్యాచ్ విజయంతో శుభారంభం చేసి, సిరీస్ లో 1-0 తో ముందడుగు వేసింది.
టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట బౌలింగ్ తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన ఆఫ్గాన్ ఓపెనర్లు చక్కగా ప్రారంభించారు. గుర్బాజ్ (23), ఇబ్రహీం (25) పరుగులు చేశారు. 7.6 ఓవర్ల దగ్గర 50 పరుగుల వద్ద తొలి వికెట్ పడింది. అక్షర్ పటేల్ తొలి బ్రేక్ ఇచ్చాడు.
తర్వాత ఫస్ట్ డౌన్ వచ్చిన ఓమర్ జై (29) పర్వాలేదనిపించాడు. ముఖేష్ కుమార్ బౌల్డ్ చేయడంతో అవుట్ అయ్యాడు. తర్వాత సెకండ్ డౌన్ వచ్చిన రహ్మత్ షా (3)ను కూడా అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. తర్వాత మహ్మద్ నబీ కాసేపు కంగారుపెట్టాడు. తను 27 బాల్స్ లో ధనాధన్ 42 పరుగులు చేసి , చివరికి ముఖేష్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత వచ్చిన నజీబుల్లా జద్రాన్ (19) నాటౌట్ గా నిలిచాడు. ఎట్టకేలకు 20 ఓవర్లలో ఆఫ్గానిస్తాన్ 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. చివరి డెత్ ఓవర్లలో పరుగులు ధారాళంగా వచ్చాయి. లేకపోతే అంత స్కోర్ వచ్చేది కాదు. అలాగే మ్యాచ్ విన్నర్ గా నిలిచిన ఆల్ రౌండర్ శివమ్ దూబె 2 ఓవర్లు బౌలింగ్ చేసి 1 వికెట్ తీసుకున్నాడు. అయితే సులువైన క్యాచ్ డ్రాప్ చేయడం పెద్ద మైనస్ గా మారింది. ముఖేష్ కుమార్ 2, అక్షర్ పటేల్ 2, శివమ్ దూబె 1 వికెట్ తీసుకున్నారు.
159 పరుగుల లక్ష్య ఛేదనతో బ్యాటింగ్ కి దిగిన టీమ్ ఇండియాకి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. సుమారు 14 నెలల తర్వాత టీ 20 ఫార్మాట్ లోకి అతికష్టమ్మీద వచ్చిన రోహిత్ శర్మ తనేదో ప్రూవ్ చేసుకొని అందరి నోళ్లూ మూయించాలని అనుకున్నాడు. కానీ అవకాశం రాలేదు. అనూహ్యంగా రన్ అవుట్ అయ్యాడు.
తను ఫ్రంట్ ఫుట్ కి వచ్చి కొట్టి, రన్ కి వచ్చేశాడు. కానీ గిల్ మాత్రం వెళ్లలేదు. దీంతో అవతలి ఎండ్ కి చేరుకున్న రోహిత్ నిరాశగా వెనుతిరిగాడు. తన అసహనాన్ని అంతా గిల్ మీద చూపించాడు. అయితే ఇందులో తన తప్పు కూడా ఉందని అంటున్నారు. బాల్ ఫీల్డర్ చేతిలోకి వెళ్లిందా? లేదా? అని చూడకుండా పరుగెట్టడం కరెక్ట్ కాదని అంటున్నారు.
అది గిల్ చూశాడు కాబట్టే ఆగిపోయాడని, అందుకు తనని నిందించడం కరెక్ట్ కాదని సీనియర్లు అంటున్నారు. ఒకవేళ కెప్టెన్ పిలిచాడు కాబట్టి గిల్ గుడ్డిగా వెళ్లినా అవుట్ అయ్యేవాడుకాదని అంటున్నారు. ఎందుకంటే రోహిత్ కొట్టిన బాల్ ని ఫీల్డర్ మిస్ ఫీల్డ్ చేశాడు. అది చాలు గిల్ క్రీజులోకి చేరడానికని అంటున్నారు.
మొత్తానికి అలా పరుగులేమీ చేయకుండానే టీమ్ఇండియా తొలివికెట్ కోల్పోయింది. ఫస్ట్ డౌన్ వచ్చిన తిలక్ వర్మ, గిల్ ఇద్దరూ కలిసి మ్యాచ్ ని పట్టాలెక్కించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో గిల్ చాలా దూకుడుగా ఆడాడు. పవర్ ప్లే లో ధనాధన్ ఆడి 12 బాల్స్ లో 5 ఫోర్లతో 23 పరుగులు చేసి, అదే ఊపులో అయిపోయాడు.
తర్వాత శివమ్ దూబె వచ్చాడు. తన రాకతో మాచ్ స్వరూపమే మారిపోయింది. అప్పుడే 2 వికెట్లు పడిపోయాయి. ఇప్పుడెలారా.. భగవంతుడా? అని అంతా అనుకున్నారు. అప్పటికి 3.5 ఓవర్లలో టీమ్ ఇండియా చేసింది కేవలం 28 పరుగులు మాత్రమే.
ఆ సమయంలో ఆపద్భాందవుడిలా శివమ్ దూబె వచ్చాడు. ఆఫ్గాన్ బౌలింగ్ ని తుత్తునియలు చేశాడు. మరో ఎండ్ లో తిలక్ వర్మ కూడా బాగానే ఆడాడు. 2 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి 8.4 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసిన టీమ్ ఇండియా సురక్షిత స్థానానికి చేరుకుంది.
తర్వాత వికెట్ కీపర్ జితేష్ శర్మ వచ్చాడు. మామూలుగా ఆడలేదు. 20 బాల్స్ లో 5 ఫోర్లు కొట్టి చకచకా 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత టీమ్ ఇండియా ఆశా కిరణం, బెస్ట్ ఫినిషర్ రింకూ సింగ్ వచ్చాడు. శివమ్ దూబె తో కలిసి చివరి వరకు ఉండి విజయాన్ని అందించాడు. తను 2 ఫోర్లతో 9 బాల్స్ లో 16 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
మరోవైపు శివమ్ దూబె 60 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అంతేకాదు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని అందుకున్నాడు. ఆఫ్గాన్ బౌలింగ్ లో రహ్మాన్ 2, ఓమర్ జాయ్ 1 వికెట్టు తీసుకున్నారు.
.
.