Shardul Thakur : టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన ప్రియురాలు మిథాలీ పారుల్కర్ ను పెళ్లాడాడు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో గతేడాది నవంబర్ లో మిథాలీతో శార్దూల్ ఠాకూర్ ఎంగేజ్ మెంట్ జరిగింది. సోమవారం రాత్రి ముంబైలో ఈ జోడి వివాహం వైభవంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆత్మీయుల సమక్షంలో పెళ్లి వేడుకను జరిపించారు.
ఎవరీ మిథాలీ..?
మిథాలీ పారుల్కర్ 1992లో మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఓ ఉన్నత కుటుంబంలో జన్మించారు. ముంబైలోనే చదువు సాగింది. 2014లో మిథీబాయ్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత 2015లో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. బహుళజాతి సంస్థ జేఎస్డబ్ల్యూలో ఇంటర్న్షిప్ చేశారు. ఆ తర్వాత 2017లో బ్లూస్టార్ డైమండ్స్లో కంపెనీ సెక్రెటరీగా పని చేశారు. 2018 అక్టోబర్ వరకు ఆ సంస్థలోనే పని చేశారు. ఆ తర్వాత 2019 మే నుంచి 2020 వరకు చేతక్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సంస్థలో సెక్రెటరీగా పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు.
అంకుర సంస్థ స్థాపించి విజయం సాధించిన మిథాలీ పారుల్కర్.. వ్యాపారవేత్తగా మంచి పేరు సంపాదించారు. ప్రస్తుతం వ్యాపారరంగంలో రాణిస్తున్నారు. మహారాష్ట్రలోని థానే లో ఆల్ ది జాస్ లగ్జరీ బేకర్స్ పేరుతో 2020 ఫిబ్రవరిలో ఓ సంస్థను ఏర్పాటు చేశారు. అదే పేరుతో ఓ వెబ్సైట్ను ప్రారంభించారు. బేకరీ ఉత్పత్తులను ఆన్లైన్లోనూ విక్రయిస్తున్నారు. చదువుకుంటున్న రోజుల్లోనే శార్దూల్తో మిథాలీ ప్రేమలో పడ్డారు. శార్దూల్ ఠాకూర్తో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. ఆమె ఆమీర్ ఖాన్ కు వీరాభీమాని. అమీర్ సినిమాలు బాగా ఇష్టపడతారు. పెంపుడు జంతువులను చెరదీస్తారు.