SHAMI COUNTER : ప్రపంచకప్ లో మహ్మద్ షమీ పెను సునామీగా మారాడు. ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో 16 వికెట్లు తీసుకుని వన్డే వరల్డ్ కప్ 2023లో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఉన్నాడు. అంతేకాదు ఇదే వరల్డ్ కప్ లో రెండుసార్లు 5 వికెట్లు తీసుకున్న బౌలర్ గా గుర్తింపు పొందాడు. ఈ సమయంలో షమీ పెట్టిన ఒక ఇన్ స్టా పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అందులో సారాంశం ఏమిటంటే..
“కొంచెమైనా సిగ్గుపడండి. ఇండియన్స్ ఆట ఎలా ఆడుతున్నారో, వికెట్లు ఎలా తీస్తున్నారో గమనించండి.. మీరు కూడా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడారు కదా.. మీకు రూల్స్ తెలీదా?” అని షమీ మండిపడ్డాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ హసన్ రాజాని ఉద్దేశించే ఈ మాటలన్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
ఎప్పుడూ కూల్ గా ఉండే షమీ, ఎందుకింత సీరియస్ అయ్యాడు. అయినా బీసీసీఐ నిబంధనల ప్రకారం ఆటగాళ్లు వివాదాస్పద కామెంట్లు చేయకూడదు. వాటిల్లో తల దూర్చకూడదు. అది క్రమశిక్షణ నియమావళి కిందకు వస్తుంది. ఇలాంటి టైమ్ లో షమీ ఎందుకిలా మాట్లాడాడని అంటున్నారు. ఎందుకు తొందరపడ్డావ్ అని కామెంట్ చేస్తున్నారు. కొందరు బాగా చెప్పావ్ అని సపోర్ట్ చేస్తున్నారు.
తను స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే హాసన్ రాజా ఇండియన్స్ అంత త్వరగా ఎందుకు వికెట్లు తీస్తున్నారు. 55కే శ్రీలంక ఆలౌట్ అయిపోవడమేంటి? ఇందులో ఏదో మతలబు ఉంది. వారు ఎంపైర్స్ ని మేనేజ్ చేసి బాల్స్ ని మార్చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆ టైమ్ లో అధిక వికెట్లు పడింది షమీకే. అది తనని ఉద్దేశించే అన్నాడని భావించిన షమీ ఇలా కౌంటర్ ఇచ్చాడు. అది కూడా ఇన్నిరోజులు బాగా ఆలోచించి చెప్పాడు.
ఇంకా ఏమన్నాడంటే.. “అర్థం పర్థం లేని మాటలు మాట్లాడొద్దు. ఇతరుల విజయాలను చూసి అప్పుడప్పుడైనా ఆనందించడం నేర్చుకోండి. అది మీ ఆరోగ్యానికి మంచిది. ఇది పాకిస్తాన్ లో ఆడే గల్లీ క్రికెట్ కాదు. ఐసీసీ ప్రపంచకప్. మీ దేశానికి చెందిన వసీం అక్రమ్ ఎంత చక్కగా చెప్పాడు. కనీసం మీవాడు చెప్పిన విషయాన్నయినా నమ్మండి. మీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు”.. అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
ఇందులో తెలివిగా ఏం చేశాడంటే.. కామెంట్ మాత్రమే పెట్టి ఊరుకున్నాడు. కానీ ఎవరిని ఉద్దేశించి అన్నాడో అందులో ప్రస్తావించలేదు. చూశారా.. షమీలో కూడా జర్నలిస్టుల తెలివి తేటలు వచ్చేస్తున్నాయని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఊరూపేరూ చెప్పకుండా భలే రాశాడని కొందరు మెచ్చుకుంటున్నారు.