Shakib al hasan: బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లకు ఎంతోమంది జీవితాలు బలైపోయాయి. రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది యువత ప్రాణాలు కోల్పోయారు. గవర్నమెంట్లే మారిపోయాయి. ప్రధాని షేక్ హసీనా జీవితమే తారుమారైపోయింది. సంపాదించిన ఆస్తులన్నీ వదిలేసి కట్టుబట్టలతో శరణార్థిగా భారత్ కి వచ్చేసింది.
ఈ పరిస్థితుల్లో అక్కడ జరిగిన హింసాత్మక సంఘటనల్లో మరణించిన ఒక యువకుడి తండ్రి ఏం చేశాడంటే… క్రికెటర్ షకీబ్ అల్ హాసన్ పై కేసు పెట్టాడు. దీంతో హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రాశారు. ఇప్పుడీ పరిస్థితుల్లో షకీబ్ దేశం వదిలి పాకిస్తాన్ లో జరిగే టెస్టు మ్యాచ్ లో ఆడుతున్నాడు. మరి త్వరలో భారత్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు జట్టులో ఉంటాడా? లేదా? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో బంగ్లా క్రికెట్ అధ్యక్షుడు ఫరూఖి అహ్మద్ మాట్లాడుతూ…షకీబ్ పై ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రాన నేరారోపణ రుజువైనట్టు కాదని అన్నారు. ఒకవేళ దోషిగా తేలి, శిక్ష పడినప్పుడు చూద్దామని అన్నారు. నిజానికి షకీబ్ విషయంలో మా క్రికెట్ బోర్డుకి లీగల్ నోటీసులు వచ్చాయి.. మేం కూడా పరిశీలిస్తున్నామని అన్నారు.
తనెప్పటి నుంచో బీసీబీ కాంట్రాక్టులో ఉన్నాడని అన్నారు. బంగ్లా క్రికెట్ కి మేలు చేసిన ఎంతోమంది క్రికెటర్లలో తను కూడా ఒకడని గుర్తు చేశారు. అలాంటి క్రికెటర్ కష్టాల్లో ఉంటే బోర్డు చూస్తూ ఊరుకోదని అన్నాడు. తను న్యాయ సలహా కోరితే, బోర్డు తరఫున లాయర్లని పెడతాం. షకీబ్ తరఫున న్యాయస్థానంలో పోరాడతామని అన్నారు.
అలాగే షకీబ్ కు సర్రే కౌంటీ క్రికెట్ ఆడేందుకు ఎన్ వోసీ కూడా ఇచ్చామని తెలిపారు. బంగ్లాదేశ్ క్రికెట్ కు మేలు జరుగుతుందని అనుకుంటే, ఆ క్రికెటర్ వెన్నంటే ఉంటామని అన్నారు. తనిప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. తప్పకుండా భారత్ పర్యటనకు వెళతాడని చెప్పుకొచ్చారు. అన్నింటికన్నా మించి పాక్ పై తొలి టెస్టు విజయంలో షకీబ్ కీలక పాత్ర పోషించాడని అన్నారు.
Also Read: ఇక సెలవు.. ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ డేవిడ్ మలన్
మరోవైపు షకీబ్ ను పాక్ రెండో టెస్టు నుంచి తొలగించాలని, వెంటనే బంగ్లాదేశ్ రప్పించాలని, అన్ని ఫార్మాట్లలో అతనిపై నిషేధం విధించాలని, మరణించిన కుర్రాడి తండ్రి తరఫు న్యాయవాదులు…బీసీబీకి లీగల్ నోటీసులు పంపించారు. ఈ సమయంలో బీసీబీ అధ్యక్షుడు ఇలా మాట్లాడటంతో వివాదం ముదిరేలా ఉందని అంటున్నారు.
అయితే షకీబ్ ఈ కేసులో 28వ నిందితునిగా ఉన్నాడు. అందువల్ల కేసు నిలవకపోవచ్చునని అంటున్నారు. ఏదో ఫార్మాల్టీకి పిలుస్తారు తప్ప, మరొకటి కాదని సీనియర్ న్యాయవాదులు చెబుతున్నారు.