India Vs England 2nd Test Team Updates : విశాఖలో జరగనున్న రెండో టెస్టుపై పలువురు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రముఖ మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ ఈసారి బౌలింగ్ లో భారీ మార్పులు ఉండనున్నాయని తెలిపాడు. తన అంచనా మేరకైతే, విశాఖ పిచ్ స్పిన్ కు తిరిగితే మాత్రం నలుగురు స్పిన్నర్లు ఉంటారని తెలిపాడు. సిరాజ్ కు బదులు కులదీప్ వస్తాడని అన్నాడు. అక్షర్ పటేల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్ ఉంటారని తెలిపాడు.
తను కూడా ఒక జట్టుని ఎంపిక చేశాడు. గిల్, శ్రేయాస్ ని తను కూడా తప్పించలేదు. తొలి టెస్ట్ లో ఆడినవాళ్లనే దాదాపు ఎంపిక చేశాడు. కేఎల్ రాహుల్ ప్లేస్ లో సర్ఫరాజ్, పటీదార్ ఇద్దరిలో ఒకరు వస్తారని తెలిపాడు.
తను కాకుండా రకరకాల విశ్లేషణలు జరుగుతున్నాయి. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, విరాట్ కొహ్లీ ముగ్గురూ జట్టుకి దూరం కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీసేవిలా ఉన్నాయని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు. వీరు ముగ్గురిని రీప్లేస్ చేయడం అనుకున్నంత ఈజీ కాదని కూడా అంటున్నారు.
దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ రికార్డు అద్భుతంగా ఉందని అన్నాడు. అతని ట్రాక్ చూశాను. 66 ఇన్నింగ్స్ల్లో 3912 పరుగులు చేశాడు. 69 సగటు ఉంది. 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు సాధించాడని తెలిపాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఇది గొప్ప రికార్డని తెలిపాడు. అయితే రజత్ పటిదార్ ని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. అతను కూడా అరంగ్రేటం చేయాలని కోరుకుంటున్నానని అన్నాడు.
టీమ్ ఇండియాకే కాదు గాయాల బెడద, ఇంగ్లాండ్ జట్టులో కూడా ఉంది. మోకాలి గాయం కారణంగా ఆ జట్టు స్పిన్నర్ జాక్ లీచ్.. విశాఖ టెస్టులో ఆడేది అనుమానంగా మారింది. అతను ప్రాక్టీస్ కూడా చేయలేదు. ఒకవేళ రీచ్ దూరమైతే…అతడి స్థానంలో షోయబ్ బషీర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఈసారి కూడా ఇంగ్లాండ్ నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగేలా ఉంది. టీమ్ ఇండియా కూడా దాదాపు అదే వ్యూహంతో ప్రణాళికలు రచిస్తోంది. తుది జట్టు ఎంపికపై కుస్తీ పడుతోంది.