SA Women vs IND Women T20 Match(Latest sports news today): టీమ్ ఇండియా అమ్మాయిలు అదరగొట్టారు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్ లో అన్నింటా పై చేయి సాధించారు. వన్డేల్లో క్లీన్ స్వీప్ చేశారు. ఏకైక టెస్టు మ్యాచ్ లో ఘన విజయం సాధించారు. ఇప్పుడు టీ 20 సిరీస్ సమం చేశారు. మొత్తంగా దక్షిణాఫ్రికా జట్టుకు భారత పర్యటనలో సిరీస్ విజయమే దక్కలేదు.
వివరాల్లోకి వెళితే.. చెన్నైలో దక్షిణాఫ్రికా వర్సెస్ ఇండియా మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్ల సీరీస్ 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపొందగా.. రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. చివరి మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది.
టాస్ గెలిచిన ఇండియా మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 84 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. లక్ష్య ఛేదనలో ఇండియా ఒక్క వికెట్ నష్టపోకుండా 10.5 ఓవర్లలో 88 పరుగులు చేసి విజయపతాకం ఎగురవేసి, సిరీస్ సమం చేసింది.
Also Read : జింబాబ్వేతో మూడో టీ 20: ఆ ముగ్గురూ వచ్చేశారు
టాస్ ఓడిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేసింది. ముగ్గురు తప్ప ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. మేరిజన్నె(10), అన్నెకె బోష్ (17) చేశారు. తజ్మిన్ బ్రిట్స్ ఒక్కరే 20 పరుగులు చేసి ఫర్వాలేదనిపించింది. కెప్టెన్ లౌరా (9) తక్కువ పరుగులకే అవుట్ అయిపోయింది. అందరిదీ అదే పరిస్థితి. ఇద్దరు డక్ అవుట్లు అయ్యారు. మొత్తానికి అలా 17.1 ఓవర్లలో 84 పరుగులకి ఆలౌట్ అయిపోయారు. పూజా వస్త్రాకర్ 4 వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించింది.
ఇండియా బౌలింగులో అరుంధతి రెడ్డి 1, శ్రేయాంక పాటిల్ 1, రాధా యాదవ్ 3, దీప్తీ శర్మ 1 వికెట్ పడగొట్టారు. 85 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా ఎటువంటి తొట్రుపాటు లేకుండా యథేచ్ఛగా ఆడింది. ఓపెనర్ స్మ్రతి మంథాన 40 బంతుల్లో 2 సిక్స్ లు, 8 ఫోర్లతో 54 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. మరో ఓపెనర్ షెఫాలి వర్మ (27) నాటౌట్ గా నిలిచింది. ఇక ఇద్దరూ కలిసి ఒక్క వికెట్ నష్టపోకుండా 10.5 ఓవర్లలో జట్టుని విజయ తీరాలకు చేర్చారు. టీ 20 సిరీస్ ను సమం చేశారు.
దక్షిణాఫ్రికా బౌలింగులో ఎవరికి వికెట్లు దక్కలేదు. మొత్తం ఆరుగురు బౌలింగు చేసినా ఫలితం దక్కలేదు. మొత్తం మూడు ఫార్మాట్లలో పోరాడలేక.. దక్షిణాఫ్రికాకి నిరాశగా తిరుగుముఖం పట్టింది.