SA vs IND Second Test : క్రికెట్ చరిత్రలోనే కనివినీ ఎరుగని పతనంగా టీమ్ ఇండియా ఆట తీరును వర్ణిస్తున్నారు. ఒక్కసారి గొప్ప కల కళ్ల ముందే చెదిరిపోయినట్టు అయిపోయింది. అంతవరకు పటిష్టంగా కనిపించిన టీమ్ ఇండియా ఒక్కసారి పేకమేడలా కుప్పకూలిపోయింది.
ఒక దశలో 153 పరుగులకి 4 వికెట్లతో పటిష్టంగా ఉన్న టీమిండియా కేవలం 11 బాల్స్ లో మిగిలిన 6 వికెట్లు కోల్పోయింది. ఇందులో ఆరుగురు టీమ్ ఇండియా బ్యాటర్లు సున్నాలు చుట్టారు. అంటే ఒక్క పరుగు కూడా చేయకుండా అవుట్ కావడం ఇదొక చెత్త రికార్డ్ అని చెబుతున్నారు. కేవలం ముగ్గురే ముగ్గురు రోహిత్ శర్మ (39), శుభ్ మన్ గిల్ (36), విరాట్ కొహ్లీ (46) ఆడారు. తర్వాత కేఎల్ రాహుల్ (8) అంతే, మిగిలిన అందరూ కూడా సున్నాలు చుట్టేశారు.
వచ్చిన సువర్ణావకాశాన్ని చేజేతులారా టీమ్ ఇండియా కోల్పోయింది. కేవలం 98 పరుగుల లీడ్ ఇండియాకి దొరకడం ఒక్కటే ఊరటగా మిగిలింది. 153 పరుగులకి 4 వికెట్లతో పటిష్టంగా కనిపించిన టీమ్ ఇండియా అదే స్కోరుపై అవుట్ కావడం ఎవరికి జీర్ణం కావడం లేదు. ఇక్కడ నుంచి మరో వంద పరుగులు చేస్తే చాలు, 200 పరుగులు లీడ్ తో సెకండ్ ఇన్నింగ్స్ కి వెళ్లి, విజయం సాధిస్తుంది. సిరీస్ సమం చేస్తుందని భావించిన అభిమానులకు టీమ్ ఇండియా షాక్ ల మీద షాక్ లు ఇచ్చింది.
సైకిల్ స్టాండ్ లో సైకిళ్లు పడినట్టు చివర వికెట్లు టపటపా పడిపోయాయి. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. తొలిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది.