టీమ్ ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి నుంచి బయటపడాలి. అలా చేయాలంటే ఒక్కటే మార్గం ఉంది. అది ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్లా ఊరిస్తున్న సౌతాఫ్రికాపై టెస్ట్ సిరీస్ విజయం. ఈ దశలో ఎన్నో అంచనాలతో విదేశీ గడ్డపై ప్రారంభమైన తొలిటెస్ట్ లో సీనియర్లతో కూడిన జట్టు ఎప్పటిలాగే తడబడింది.
దశాబ్దాలుగా సౌతాఫ్రికా గడ్డపై ఆడలేని బలహీనతలను బయటపెట్టుకుంటూ తొలిరోజు వికెట్లను టపటపా పారేసుకుంది.
కాకపోతే ఆపద్బాంధవుడిలా కేఎల్ రాహుల్ ఆదుకున్నాడు. ఒక్కడు ఒంటరిపోరాటం చేసి 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులతో పడుతూ లేస్తూ ముందుకెళుతోంది. మహ్మద్ సిరాజ్.. రాహుల్ కి అండగా ఉన్నాడు. తను 10 బాల్స్ ఆడి ఇంకా ఖాతా ప్రారంభించలేదు.
అయితే నాలుగో సెషన్ లో వెలుతురు సరిగా లేని కారణంగా ఆటను అంపైర్లు ముందుగానే నిలిపివేశారు. అప్పటికి 59 ఓవర్లు గడిచాయి. ఫ్లడ్ లైట్ల వెలుగులో ఆట ప్రారంభం అవుతుందని అనుకునేలోపు వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ను అంపైర్లు నిలిపివేశారు.
టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా బౌలింగ్ తీసుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన టీమిండియా ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇద్దరూ సరైన ఆరంభాన్ని ఇవ్వలేదు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే పవర్ ప్లే లో ఆడినట్టు ఆడి వికెట్టు పారేసుకోవడంతో విమర్శల పాలయ్యాడు.
సీనియర్లు గవాస్కర్ లాంటి వాళ్లు మరీ మరీ చెప్పినా, తన ఆటతీరుని మార్చుకోలేని బలహీనతలపై నెట్టింట ట్రోలింగ్ కి గురయ్యాడు. కేవలం 5 పరుగులు చేసి జట్టు స్కోర్ 13 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఇక అక్కడ నుంచి వికెట్ల పరంపర మొదలైంది. యశస్వి జైశ్వాల్ (17) అవుట్ అయ్యాడు. తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గిల్ (2) దారుణంగా విఫలమయ్యాడు. తను ఫామ్ కోల్పోయాడని, మళ్లీ ఎప్పటికి పికప్ అవుతాడోనని అంతా అనుకుంటున్నారు.
అప్పటికి 11.1 ఓవర్ లో 24 పరుగులకి 3 వికెట్లు పడిపోయి టీమ్ ఇండియా పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ దశలో వచ్చిన కింగ్ విరాట్ కోహ్లీ చాలా ఆశావాహ దృక్పథంతో ఆట ప్రారంభించాడు. తనకి శ్రేయాస్ అయ్యర్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. వీరిద్దరూ నాలుగో వికెట్టుకి 68 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. అంటే టీమ్ ఇండియా చేసిన 208 పరుగుల్లో ఇదే ఎక్కువ భాగస్వామ్యం అని చెప్పాలి.
వీరిద్దరు కుదురుకుంటున్నారనే దశలో శ్రేయాస్ అయ్యర్ ( 31) అవుట్ అయ్యాడు. కాసేపటికి రబడా అద్భుతమైన ఇన్ స్వింగ్ కి కోహ్లీ (38) బలైపోయాడు. కోహ్లీకి బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్లు తమ శక్తియుక్తులన్నీ వాడతారు. అలా రబడా వేసిన బాల్ వికెట్ల పక్క నుంచి వెళుతూ, చిన్నగా కోహ్లీ బ్యాట్ వద్ద మాత్రమే ఇన్ స్వింగ్ అయి,ఆ బ్యాట్ ని తాకి కీపర్ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఏదో మ్యాజిక్ లా జరిగిపోయింది. మొత్తానికి 30.6 ఓవర్లలో 91 పరుగుల వద్ద ఐదో వికెట్ గా కోహ్లీ అవుట్ అయ్యాడు.
ఇక 150 పరుగులలోపు అంతా చాప చుట్టేస్తారనుకునే దశలో కేఎల్ రాహుల్ వచ్చి, అంతటి భయంకరమైన పిచ్ మీద నిలబడి బ్యాటింగ్ చేశాడు. 70 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. టెయిల్ ఎండర్స్ తో ఓపికగా బండిని లాగుతున్నాడు. అశ్విన్ (8), జస్ప్రిత్ బుమ్రా (1) త్వరగా అవుట్ అయ్యారు. ఈ క్రమంలో శార్దూల్ ఠాకూర్ తో కలిసి 7 వికెట్ భాగస్వామ్యానికి విలువైన 43 పరుగులు జోడించాడు. మహ్మద్ సిరాజ్ అండగా జట్టు స్కోరుని 208 పరుగులకి చేర్చాడు.
ఇకపోతే మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని సౌతాఫ్రికా వాతావరణ శాఖ హెచ్చరికలు పని చేయలేదు. తొలిటెస్ట్ ప్రశాంతంగానే ప్రారంభమైంది. కాకపోతే ఏ క్షణమైనా వర్షం పడే అవకాశం ఉండటంతో వేగంగా పరుగులు చేయాలన్న టీమ్ ఇండియా గేమ్ ప్లాన్ వర్కవుట్ కాలేదు. గాలి బలంగా వీయడం, పిచ్ పై తేమ ఉండటం, మరో వైపు చలిగాలులు, వర్షం పడే సూచనలు.. ఇలా ప్రతికూల వాతావరణంలో టీమ్ ఇండియా ఎదురీదుతోంది. రెండోరోజు మనవాళ్లు ఆలౌట్ అయి, సౌతాఫ్రికాను ఎలా నిలువురిస్తారన్న దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.